ఒక్క పోస్ట్‌ తో టీఆర్ ఎస్‌ లో క‌ల‌వ‌రం సృష్టించిన రాముల‌మ్మ‌

Update: 2019-09-05 07:04 GMT
తెలంగాణలో రాజ‌కీయాలు హాట్ హాట్‌ గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీ ఓ వైపు రాష్ట్రంలో బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంటే...మ‌రోవైపు టీఆర్ ఎస్‌ లో అంత‌ర్గ‌త ప‌రిణామాలు రాజ‌కీయ విశ్లేష‌కులను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ఈ త‌రుణంలో టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్‌ పర్స‌న్ - సినీన‌టి విజయశాంతి ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించారు. టీఆర్ ఎస్ నేత‌లు ఎవ‌రికి వారు త‌మ‌దైన శైలిలో రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆమె వ్యాఖ్యానించారు. ఫేస్‌ బుక్‌ లో పెట్టిన ఓ సుదీర్ఘ పోస్ట్‌ లో రాముల‌మ్మ గులాబీ పార్టీ ప‌రిణామాల‌ను ఎద్దేవా చేశారు.

తెలంగాణ‌లో విష జ్వ‌రాల నుంచి మొద‌లుకొని టీఆర్ ఎస్ పార్టీ రాజ‌కీయాల వ‌ర‌కు విజ‌య‌శాంతి ప్ర‌స్తావించారు. ``తెలంగాణ‌లో జనం అంతా విష జ్వరాలతో అల్లాడుతుంటే అధికార టీఆర్ ఎస్ పార్టీలో మాత్రం గులాబీ జెండాకు బాస్ ఎవరు? అని ఓ వర్గం... కెసిఆర్ తప్ప గులాబీ జెండా కు బాస్ ఎవరు లేరని మరో వర్గం వాదించుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. అందరి కంటే తనకు రాజకీయాల్లోనూ పాలనాపరంగా ముందుచూపు ఉందని ప్రకటించుకునే కెసిఆర్ గారు.. విష జ్వరాలతో ప్రజలు పడే బాధల విషయంలో మాత్రం ఎందుకు జాగ్రత్త చర్యలు తీసుకోలేదో జనానికి అంతుబట్టడం లేదు. ఆరోగ్య సమస్యలను కారణంగా చూపించి... తనను బలిపశువును చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు సన్నిహితులతో వాపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో డెంగ్యూ జ్వరాలు స్వైన్ ఫ్లూ వంటి జ్వరాలతో జనం ఆస్పత్రులలో బారులు తీరుతున్నప్పటికీ.. ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం దీనిని పెద్ద సీరియస్‌ గా పరిగణించాల్సిన అవసరం లేదని పరిస్థితిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్య లోపం వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నాయనే వాదన కూడా ఉంది. ఈ రోజు ఈటల రాజేందర్ గారు జిహెచ్ ఎంసిలో సమావేశం నిర్వహించి... ఇదే అంశాన్ని ప్రస్తావించడం వెనుక కారణం కూడా లేకపోలేదు. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కనుసన్నల్లోనే ఇప్పటికీ జిహెచ్ ఎంసితో పాటు మున్సిపల్ వ్యవస్థ నడుస్తోంది అన్నది జగమెరిగిన సత్యం. ఒకవేళ ఈ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వివాదంలో తనను ఇరికించాలని అనుకుంటే పరోక్షంగా ఈ సమస్యను కేటీఆర్ గారిమెడకు చుట్టాలని ఈటల రాజేందర్ గారు భావిస్తున్నట్లు టిఆర్ ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఓవైపు ఇంత బీభత్సం జరుగుతున్నా.... మాజీ మంత్రి హరీష్ రావు గారు మాత్రం సందట్లో సడేమియా అన్న చందంగా... తన అనుచరులతో వెయ్యి కొబ్బరి కాయలు కొట్టించి... తాను ముఖ్యమంత్రి అవ్వాలని మొక్కులు చెల్లిస్తూ... చాపకింద నీరులాగా పావులు కదుపుతున్న విషయం స్పష్టమైంది. బంగారు తెలంగాణ చేసి చూపుతామని అధికారంలోకి వచ్చి కేసీఆర్ అండ్ కో ఏ రకంగా అధికార దాహంతో ప్రజల జీవితంతో ఆడుకుంటుందో ఇటీవల పరిణామాలు చూస్తే అర్థమవుతుంది.`` అని విజ‌య‌శాంతి సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ - ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌ - మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స‌హా పార్టీ యువ‌త‌నే హ‌రీశ్ రావును టార్గెట్ చేస్తూ...విజ‌య‌శాంతి పెట్టిన ఈ పోస్ట్‌ పై గులాబీ వ‌ర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News