వెల్ కమ్ బీయారెస్ .... కేసీయార్ మేకు అవుతాడా....?

Update: 2022-10-14 08:30 GMT
ఏపీలో బీయారెస్ ప్రభావం ఎంత అంటే ఎవరూ చెప్పలేరు. కానీ అభ్యర్ధులు ఉంటారా. పార్టీ విస్తరిస్తుందా అంటే దానికి వర్తమాన రాజకీయాలను తీసుకుంటే జవాబు ఇట్టే దొరుకుతుంది. రాజకీయం కోసం ఏమైనా చేసే వారు ఉన్నారు. అదే విధంగా ఏదో ఒక పార్టీని ఎంచుకుని ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి జాబితా కొండవీటి చాంతాడు అంత ఉంటుంది. బీయారెస్ చూస్తే బలమైన పార్టీయే. తెలంగాణాలో గట్టిగానే ఉంది. ఆర్ధికంగా బాగా ఉన్న పార్టీ. దాంతో ఏపీలో ఆ పార్టీ విస్తరణకు ఇవే అర్హతలుగా కనిపిస్తున్నాయి.

ఏపీలో రాజకీయం ఇపుడు చూస్తే అంతా వైసీపీకి యాంటీగా ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రత్యార్ధిగా ఉంది. దాంతో పాటు జనసేన వైసీపీ లేని ఏపీని చూపిస్తామని చెబుతోంది. కమ్యూనిస్టులు కూడ వైసీపీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఇటీవల కాలంలో బీజేపీ ఏపీ నేతలు కూడా వైసీపీ మీద మండిపడుతున్నారు. కాంగ్రెస్ అయితే ఎటూ వైసీపీకి పరమ శత్రువే. ఈ విధంగా ఏపీ రాజకీయాన్ని చూసుకుంటే మాత్రం అన్ని పార్టీలు కాకపోయినా మెజారిటీ పార్టీలు కలిస్తే మాత్రం కచ్చితంగా ఏపీలో వైసీపీకి పొలిటికల్ గా పూర్తిగా  ఇబ్బందే.

ఆ మధ్యన పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూస్తామని ఆయన చెప్పారు. అంటే ఏపీలో అతి పెద్ద కూటమి ఏర్పాటు అవుతుంది అన్న మాట. పవన్ ఎమర్జెన్సీ తరువాత భారత దేశాన  ఏర్పడిన జనతా పార్టీ మాదిరిగా అంతా కలవాలని కోరారు. అలా కనుక చూస్తే వామపక్షాలు బీజేపీ కూడా కుడి ఎడమగా చేరి తెలుగుదేశం జనసేన పోటీ చేయాలన్నది ఆయన ఆలోచన‌గా కనిపిస్తుంది. అదే కనుక జరిగితే ఏపీలో విపక్ష కూటమి బలం అమాంతం పెరిగి అది వైసీపీ గద్దె కిందకు నీళ్ళు చేరుస్తుంది.

దాంతో తెగ టెన్షన్ పడుతున్న వైసీపీ పెద్దలు ఎలాగైనా కూటమి ఏపీలో కలవకుండా చేయాలని చూస్తున్నారు. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని జనసేనకు పదే పదే వైసీపీ మంత్రులు సవాల్ చేయడం వెనక ఉన్న ఉద్దేశ్యం కూడా అదే ఎవరికి వారు విడిగా పోటీ చేస్తే ఏపీలో మరోమారు వైసీపీ అధికారంలోకి రావడం తధ్యం. అయితే ఆ విధంగా జరిగేందుకు అవకాశాలు బహు తక్కువగా ఉన్నాయి.

పవన్ విషయమే తీసుకుంటే తాను సీఎం కాకపోయినా ఫరవాలేదు కానీ జగన్ మాత్రం సీఎం సీట్లో కూర్చోరాదు అన్న పట్టుదల కనిపిస్తుంది. ఇదే టీడీపీతో పొత్తుకు వరంగా మారుతోంది అంటున్నారు. ఇక బీజేపీ ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎన్నికల వేళకు నాలుగు సీట్లు రావాలంటే టీడీపీ జనసేనతో కూడక తప్పని  సీన్ ఉంది. ఈ క్రమంలో ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక తేవాలని వైసీపీ చూస్తోంది.

అంతకంతకు ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరుగుతోంది. దాన్ని విపక్షాలు అన్నీ కలసి ఒక్కటిగా సొమ్ము చేసుకోకుండా చూడాలని వైసీపీ ఆలోచన చేస్తోంది. అయితే అనుకోని వరంగా ఇపుడు కేసీయార్ బీయారెస్ పార్టీని ఏర్పాటు చేయడం మాత్రం వైసీపీ నెత్తిన పాలు పోసినట్లు అవుతుంది అని ఆ పార్టీ వారు భావిస్తున్నారుట.

ఎందుకంటే బీయారెస్ పోటీ చేస్తే ఆషామాషీగా ఉండదు, జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోవాలీ అంటే ఏపీలో గట్టిగానే తేల్చుకుంటుంది. కేసీయార్ సామదాన భేద దండోపాయాలతో ఏపీలో రాజకీయ దండయాత్ర చేస్తారు. ఆయన మాటల చతురతతో ఏపీ విభజన పాపాన్ని కూడా కడిగేసుకుని ప్రత్యర్ధుల నెత్తిన అంట‌గట్టే చాతుర్యం కలిగిన వాడే అంటారు. ఇక డబ్బుకు కొదవ లేదు, కేసీయార్ కులానికి ఏపీలో రాజకీయంగా పట్టు ఉంది.

ఇంకో వైపు హైదరాబాద్ లో స్థిరపడిన వారిని మ్యానేజ్ చేసి తన రూట్లోకి తెచ్చుకుంటే కచ్చితంగా ఏపీలో పాగా వేయగలమని కేసీయార్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే కేసీయార్ ఏపీలో బీయారెస్ ద్వారా ధూం ధాం చేస్తే దాని వల్ల విపక్ష ఓట్లకు ఎసరు పడుతుందా అంటే లెక్క ప్రకారం చూస్తే అలాగే జరగాలి.

దాంతో కాగల కార్యం కేసీయర్ తీరుస్తారని వైసీపీ భావిస్తోంది. కేసీయార్ కి చంద్రబాబుతో పొత్తు కచ్చితంగా ఉండదు, పవన్ తో పొత్తు ఉన్నా కూడా తమకు గరిష్ట రాజకీయ  లాభమని వైసీపీ ఆలోచిస్తోంది. ఎటూ వామపక్షలతో కేసీయార్ కి పొత్తు ఉంది కాబట్టి ఏపీలో కూడా వారు చేరుతారు అని వైసీపీ నేతలు విశ్లేషించుకుంటున్నారు. ఈ క్రమంలో  కేసీయార్ పార్టీలో కనుక పేరున్న నాయకులు ఎవరైనా చేరితే ఎక్కడికక్కడ ఓట్ల చీలిక జరిగి మరోసారి తామే అధికారంలోకి రావచ్చు అని వైసీపీ భావిస్తోంది.

అయితే  రాజకీయాల్లో ఎపుడూ ఒకటి ఒకటి రెండు కావు కాబట్టి కేసీయార్ రాజకీయ దూకుడు తో వైసీపీకి కూడా ఇబ్బందులు వస్తాయా అంటే ఏమైనా జరగవచ్చు అంటున్నారు. ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్రా మీదనే కేసీయార్ ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం వైసీపీ కూడా ఈ రెండు ప్యాకెట్స్ మీదనే తన రాజకీయాన్ని చేస్తోంది. ఇక్కడ బీయారెస్ అభ్యర్ధులు గట్టిగా జోరు చేస్తే అది వైసీపీకి కూడా ఇబ్బంది అయినా అవవచ్చు అని అంటున్నారు.

ఇక ఒకసారి ఏపీలో కేసీయార్ పార్టీకి చోటిస్తే ఆయన అసలు ఊరుకోరు. ఏకంగా ఏపీ కుర్చీనే టార్గెట్ చేసేలా పావులు కదుపుతారు. అసలే రాజకీయ చాణక్యుడుగా కేసీయార్ కి పేరుంది. దాంతో వైసీపీ అనుకున్న ఓట్ల చీలిక ఆశలు నెరవేరకపోగా మరిన్ని కొత్త ఇబ్బందులు వస్తాయా కేసీయార్ ఏకుగా ఏపీకి వచ్చి మేకులా మారితే తమ సంగతేంటి అన్న చింత కూడా వైసీపీలో ఉందిట. మొత్తానికి కేసీయార్ బీయారెస్ పార్టీ వల్ల లాభమా నష్టమా అంటే ఎటూ తేల్చుకోలేని స్థితిలోనే అధికార వైసీపీ ఉంది అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News