ఒమిక్రాన్ తర్వాతి వేరియంట్ ఎలా ఉంటుందో చెప్పిన డబ్ల్యూహెచ్ వో

Update: 2022-02-07 04:36 GMT
అనుకున్నట్లే ప్రపంచంలోని పలు దేశాల్ని వణికించిన ఒమిక్రాన్ మన దేశంలోకి రావటం.. తన సత్తా చాటే ప్రయత్నం చేయటం.. వ్యాప్తి విషయంలో తనకున్న ట్రాక్ రికార్డును ఏ మాత్రం తేడా లేకుండా వ్యవహరించినప్పటినీ.. భారతీయుల్ని ప్రభావితం చేయటంలో మాత్రం అంతగా జరగలేదని చెప్పాలి. డెల్టా వేరియంట్ మాదిరి.. ఒమిక్రాన్ ఎపిసోడ్ లో.. భారతీయులు ఆసుపత్రులకు పరుగులు పెట్టటం.. ఆక్సిజన్ కోసం క్యూలు కట్టటం.. వైదం అందక ఆసుపత్రి ప్రాంగణంలోనే  ప్రాణాలు విడవటం లాంటి దారుణ ఘటనలు చోటు చేసుకోలేదు. డెల్టా వేరియంట్ తో పోలిస్తే.. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగా ఉండటం.. హోం ఐసోలేషన్ తోనే స్వస్థత చేకూరేలా ఉండటం ఉపశమనం కలిగించేదిగా చెప్పాలి.

తాజాగా కేసుల నమోదు తగ్గుముఖం పడుతున్న వేళ.. ఒమిక్రాన్ తర్వాతేంటి? అన్న ప్రశ్నపలువురి మదిని తొలిచేస్తోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరో వేరియంట్ కానీ పుట్టుకొస్తే దాని వ్యాప్తి ఎలా ఉంటుందన్న విషయాన్ని వెల్లడించింది. కొత్త వేరియంట్ పుట్టుకొస్తే.. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్ల కంటే అధిక శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాయన్న కొత్త విషయాన్ని డబ్ల్యూహెచ్ టెక్నాలజీ హెచ్మరియా వాన్ కెర్ఖోవ్ వెల్లడించారు. ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందే గుణంతో పాటు.. రోగ నిరోధక శక్తిని ఏమార్చే గుణం కూడా ఎక్కువగా ఉండొచ్చని పేర్కొనటం గమనార్హం.

‘కొత్త వేరియంట్ మీద టీకాల ప్రభావం ఉండకపోవచ్చు. ప్రపంచం ఇలాంటి స్థితిలోకి చేరుకోకూడదని కోరుకుంటున్నాం. కొవిడ్ వ్యాప్తిని అరికట్టాలని ఆశిస్తున్నాం. కట్టుదిట్టమైన నిబంధనలతో వైరస్ వ్యాప్తి స్వల్పంగా ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని ఆమె పేర్కొన్నారు. వైరస్ ను అరికట్టేందుకు జాగ్రత్తలు పాటించాలని కోరుతూ.. రాబోయే రోజుల్లోకరోనా సీజనల్ వ్యాధిగా రూపాంతరం చెందొచ్చని.. శ్వాసకోశ వ్యాధికారకంగా మారే అవకాశం ఉందన్నారు. అయితే.. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉందన్నారు. వైరస్ నుంచి బయటపడాలంటే ప్రస్తుతం మాత్రం మాస్కు.. భౌతిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

అలా అని జీవితాంతం మాస్కులు ధరిస్తూనే ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఒమిక్రాన్ చివరి వేరియంట్ కాదని.. రాబోయే రోజుల్లో మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విరుచుకుపడే మహమ్మారులను ఎదుర్కోవటానికి ప్రస్తుతం ఉన్న దాని కంటే మరింత సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుందన్నారు. ఇదంతా విన్న తర్వాత అర్థమయ్యేదేమంటే.. కరోనాకు ముందు ప్రపంచానికి.. తర్వాత అన్న తేడా అయితే పక్కా ఉంటుందన్న విషయం డబ్ల్యూహెచ్ వో ప్రతినిధుల మాటతో అర్థమవుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News