హుజూర్ నగర్ లో టీఆర్ ఎస్ కు ఆ ఇద్దరి భయం

Update: 2019-10-11 08:06 GMT
హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఇప్పుడు తెలంగాణలోని ప్రధాన పక్షాలు దృష్టిసారించాయి. ప్రస్తుతం ఈ సీటును దక్కించుకోవాలని అధికార టీఆర్ ఎస్ - ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.. అయితే టీఆర్ ఎస్ ఇప్పుడు తన ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ ను చూసి భయపడడం లేదు.. కానీ ఇద్దరు స్వతంత్రులను చూసి మాత్రం తెగ వర్రీ అవుతోందట.. వారిద్దరికీ టీఆర్ ఎస్ కారు గుర్తును పోలిన ఎన్నికల గుర్తులు రావడమే ఈ భయానికి కారణంగా తెలుస్తోంది.

‘‘రోడ్ రోలర్ - ట్రాక్టర్ డ్రైవింగ్ చేసే రైతు’’. ఈ రెండు చిహ్నాలు దాదాపు టీఆర్ ఎస్ గుర్తు కారును పోలి ఉంటాయి. నిరక్షరాస్యులు - వృద్ధులు పొరపడి.. పోయిన ఎన్నికల్లో ఈ రెండు గుర్తులకు చాలా ఓట్లు వేశారు. పదివేల ఓట్ల వరకు పడి టీఆర్ ఎస్ అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలున్నాయి. కొన్ని సీట్లను ఈ గుర్తుల వల్లే గులాబీ పార్టీ కోల్పోయింది.

అందుకే టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక కారును పోలిన ఆటోరిక్షా - లారీ చిహ్నాలు ఎవరికీ ఇవ్వవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరింది. అయితే ఇప్పుడు ఆ గుర్తులను అయితే ఈసీ కేటాయించలేదు. కానీ తాజాగా హుజూర్ నగర్ లో కారును పోలిన ‘రోడ్ రోలర్’ - ట్రాక్టర్ గుర్తులు మాత్రం ఇద్దరు స్వతంత్రులు దక్కించుకున్నారు.

దీంతో టీఆర్ ఎస్ లో భయం మొదలైంది. కారుకు ఈ రోడ్ రోలర్ - ట్రాక్టర్ గుర్తులకు తేడాలను చూపిస్తూ టీఆర్ ఎస్ శ్రేణులు ఇప్పుడు హుజూర్ నగర్ లో ఓటర్లకు అవగాహన కల్పించే పనిలో పడ్డాయి. ఒక్క ఓటు కూడా ఎన్నికల్లో కీలకం.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూర్ నగర్ లో ఇప్పుడు ఈ రోడ్ రోలర్ - ట్రాక్టర్ గుర్తులు టీఆర్ ఎస్ ను  పెద్ద దెబ్బతీసేలా ఉన్నాయన్న అనుమానాలు గులాబీ శ్రేణులను పట్టి పీడిస్తున్నాయి..

ఇక గతంలోనూ తెలుగుదేశం పార్టీ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంది. సైకిల్ ను పోలిన బైక్ గుర్తు ఆ పార్టీని దెబ్బతీసింది. చాలా కష్టపడి ఈసీతో ఫైట్ చేసి బైక్ గుర్తును టీడీపీ ఎన్నికల్లో నిషేధించింది. ఇప్పుడు టీఆర్ ఎస్ పార్టీ కూడా తన కారు గుర్తు పోలిన గుర్తులపై పోరాటం మొదలెట్టింది.


Tags:    

Similar News