కేసీయార్ తో కేజ్రీవాల్ కలుస్తారా ?

Update: 2022-03-01 09:30 GMT
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మరికొందరు ప్రముఖులతో భేటీ అవటానికే కేసీయార్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నంపైన ముందు వీళ్ళద్దరి భేటీ జరగబోతోంది. రాబోయే ఎన్నికల్లో  నరేంద్రమోడిని అధికారంలో నుండి దింపటమే టార్గెట్ గా కేసీయార్ చాలా స్పీడుగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రాంతీయపార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపైనే కేసీయార్ దృష్టి పెట్టిన విషయం అర్ధమవుతోంది.

 ముందు తమిళనాడు సీఎం స్టాలిన్ తో భేటీ అయ్యారు. తర్వాత పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో మాట్లాడారు. ఈమధ్యనే మహారాష్ట్ర సీఎం ఉధ్థవ్ థాక్రేతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కూడా సమావేశమయ్యారు. ఇపుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అవబోతున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఒకపుడు కేజ్రీవాల్ కూడా మోడి అంటే అంతెత్తున ఎగిరిపడేవారు. తర్వాత తన వ్యూహాలను మార్చుకుని చాలా సైలెంటుగా వ్యవహరిస్తున్నారు.

 మోడి వ్యతిరేక విధానాల నుండి కేజ్రీవాల్ పక్కకుపోలేదు. కానీ నోటికొచ్చినట్లు మాట్లాడటంలేదు. ఎక్కడెక్కడ దెబ్బ కొట్టాలో ప్రధానంగా ఎన్నికల్లో బీజేపీని దెబ్బ కొడుతునే ఉన్నారు. ఒకపుడు కేజ్రీవాల్ కూడా మోడికి వ్యతిరేకంగా అనేకమందిని కలిసిన వ్యక్తే. కానీ దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని అర్ధమైనట్లుంది. అందుకనే చాలా కామ్ గా తన పనేదో తాను చూసుకుంటున్నారు. ఢిల్లీ వరకు బీజేపీ గెలుపులో నరేంద్రమోడి పప్పులుడక్కుండా చూసుకుంటున్నారు.

ఈ నేపధ్యంలోనే మోడీకి వ్యతిరేకంగా తనతో చేతులు కలపమని అడిగితే సరే అనచ్చేమో కానీ కేసీయార్ లాగ తొడకొట్టడం, చాలెంజులు చేయటం లాంటివి  కేజ్రీవాల్ చేస్తారని అనుకునేందుకు లేదు. తన సమయాన్నంతా కేజ్రీవాల్ పూర్తిగా పరిపాలన, పార్టీని విస్తరించటంపైనే నిలిపారు. అంటే ఢిల్లీ సీఎంకు నరేంద్రమోడిని సవాలు చేయటం, గోల గోల చేయటం ప్రధానమైన అంశం కానేకాదు.

 చాపకింద నీరులాగ పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఆప్ ను విస్తరించేందుకు ప్లాన్లు వేసుకుంటున్నారు. మరి కేజ్రీవాల్ నుండి కేసీయార్ కు ఎంత మద్దతు లభిస్తుందో చూడాలి.
Tags:    

Similar News