బంగ్లాపై మ్యాచ్ గెలిచినా.. సెమీస్ పై భారత్ కు టెన్షన్ ఎందుకు?

Update: 2022-11-03 06:30 GMT
టీ20 వరల్డ్ కప్ ఏమో కానీ.. ఈ టోర్నీలో పాల్గొనే జట్లకు మాత్రం టెన్షన్.. టెన్షన్ గా మారుతోంది. ఏ జట్టు సెమీస్ కు అర్హత సాధిస్తుందో అర్థం కానిదిగా మారింది. తాజాగా టీమిండియా పరిస్థితే చూద్దాం. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గెలిస్తే చాలు.. సెమీస్ కు బెర్తు ఖాయమని లెక్కలు వేసుకున్న పరిస్థితికి భిన్నంగా ఇప్పుడు పరిస్థితులు ఉండటం గమనార్హం. టోర్నీలో జరిగే మ్యాచ్ లకు గెలుపు ఓటములతో లెక్కలు తేలే వేళ.. వరుణుడి సడన్ ఎంట్రీతో లెక్కలు మారిపోతున్నాయి. ఎవరు సెమీస్ కు వస్తారు? ఎవరు రారు? అన్న దానిపై కొత్త టెన్షన్ పట్టుకుంది.
గ్రూప్ 1లో..

-  న్యూజిలాండ్
-  ఇంగ్లండ్
-  ఆస్ట్రేలియా
-  శ్రీలంక
-  ఐర్లాండ్
-  అఫ్గానిస్థాన్ జట్లు ఉండగా.. గ్రూప్ 2లో..
-  భారత్
-  పాకిస్థాన్
- బంగ్లాదేశ్
-  జింబాబ్వే
-  నెదర్లాండ్స్
-  దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. గ్రూప్ 1లో పరిస్థితి గ్రూప్ ఆఫ్ డెత్ గా మారింది. ఆ గ్రూపుతో పోలిస్తే.. గ్రూప్ 2లో పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉందని చెప్పాలి.

మరి..టీమిండియా సెమీస్ కు అర్హత సాధిస్తుందా? అంటే అవునని చెప్పినా.. లెక్కల్లో వచ్చే మార్పులతో ఆ అవకాశం మిస్ అయ్యే ఛాన్సు ఉందంటున్నారు. ఈ లెక్కల్ని చూస్తే.. బుర్ర హీటెక్కిపోవటం ఖాయం. ఇంతకూ ఆ లెక్కల్ని చూద్దామా.

టీమిండియా
-  బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ తో విజయం సాధించిన జట్టు.. ఇప్పటికైతే సేఫ్ గా ఉంది. నాలుగు మ్యాచ్ లలో మూడు విజయాలు.. ఒక ఓటమితో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
-  ఈ నెల ఆరున జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే.. ఎలాంటి టెన్షన్ లేకుండా నేరుగా సెమీస్ బెర్తును కన్ఫర్మ్ చేసుకుంటుంది.
-  లెక్కలు తేడా జరిగి.. జింబాబ్వే చేతిలో ఓడినా నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో పెద్దగా నష్టం ఉండదు.
-  కానీ.. దక్షిణాఫ్రికా.. పాకిస్థాన్.. బంగ్లాదేశ్ మ్యాచ్ ల ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.
-  భారత్ - జింబాబ్వే మధ్య జరిగేదే ఆఖరి మ్యాచ్. అప్పటికి మాత్రమే సెమీస్ మీద భారత్ కు ఉన్న అవకాశాలపై మరింత స్పష్టత రానుంది.
దక్షిణాఫ్రికా

-  టీమిండియాపై గెలుపుతో రేసులోకి వచ్చిన ఈ జట్టు ప్రస్తుతం మూడు మ్యాచ్ లలో రెండు విజయాలు సాధించటం.. ఒక మ్యాచ్ రద్దు కావటంతో ఐదు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
-  మిగిలిన రెండు మ్యాచ్ లలో ఈ జట్టు పాక్.. నెదర్లాండ్స్ తో ఆడాల్సి ఉంది.
-  ఈ రెండు మ్యాచ్ లలో ఏ ఒక్కటి గెలిచినా ఏడు పాయింట్లతో సెమీస్ లోకి అడుగు పెడుతుంది. కానీ.. ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.
-  ఇప్పుడున్న ఫామ్ లో ఈ జట్టు ఓడే అవకాశాలు తక్కువగా ఉన్నా.. వీరి ట్రాక్ రికార్డు చూస్తే.. కీలక సమయాల్లో ఒత్తిడిని మీదకు తెచ్చుకొని.. టోర్నీ నుంచి ఎగ్జిట్ అయిన ఉదంతాలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. అందుకే.. వీరి విజయం ఖాయమని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.
బంగ్లాదేశ్

-  గ్రూప్ లో ఈ జట్టు మూడో స్థానంలో ఉంది.
-  ఆడిన నాలుగు మ్యాచ్ లలో రెండు విజయాలు.. రెండు ఓటమిలతో నిలిచిన జట్టు.. తన చివరి మ్యాచ్ ను పాకిస్థాన్ తో తలపడనుంది.
-  పాక్ మీద విజయాస్ని సొంతం చేసుకుంటే.. సెమీస్ కు అవకాశాలు ఉన్నప్పటికీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
-  ఈ మ్యాచ్ లో పాక్ గెలిస్తే మాత్రం.. ఇంటికి వెళ్లటం మినహా మరో దారి లేదు.
పాకిస్థాన్

-  టీమిండియాతో ఓటమి.. అనూహ్యంగా జింబాబ్వేతోనూ ఓటమి తప్పని దాయాది జట్టు కష్టాల్లో ఉంది.
-  ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ లలో ఒక విజయాన్ని రెండు ఓటములను చవి చూసింది.
-  చివరి రెండు మ్యాచ్ లలో ఒకటి దక్షిణాఫ్రికాతో.. మరొకటి బంగ్లాదేశ్ తోనూ తలపడనుంది.
-  ఈ రెండు మ్యాచ్ లను గెలిస్తే కానీ.. సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.
- ఏ ఒక్క మ్యాచ్ లో ఓడినా ఇంటిదారి పట్టాల్సిందే.
జింబాబ్వే.. నెదర్లాండ్స్

-  ఈ రెండు జట్లకు సెమీస్ అవకాశాలు తక్కువ.
-  ఈ రెండు జట్లు తమ చివరి మ్యాచ్ లలో చెలరేగిపోయి ఆడి.. గెలిచినా.. అవి మాత్రం సెమీస్ కు చేరే ఛార్సు లేదు. కాకుంటే.. ఇతర జట్ల అవకాశాల మీద ప్రభావం చూపే అవకాశం మాత్రం ఉంటుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News