జగన్ పాలనపై గణపతి సచ్చిదానంద స్వామీజీ మాటలు విన్నారా?

Update: 2021-10-19 03:58 GMT
అవధూత దత్త పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీని కలిశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. స్వామీజీ ఆశీస్సుల కోసం ఆయన ఆశ్రమానికి వెళ్లిన సీఎంకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని తప్పుగా చూపించటం.. మంచి చేసేటప్పుడు అడ్డు పడటం.. మాటిమాటికి కోర్టులకు వెళ్లటం.. తమకు అధికారం లేదని కొందరు విరుద్దంగా ప్రచారం చేయటం తగదన్నారు.

ఇలంటి చర్యలన్నీ సరైనవి కావన్న స్వామీజీ.. ఇలాంటి చేయకుండా ఉండేందుకు తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్లుగా గణపతి సచ్చిదానంద స్వామీజీ పేర్కొన్నారు. చెప్పుల్ని విడిచి పెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఆశ్రమంలోకి వచ్చారు. ఆయన వెంటనే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఉన్నారు. దాదాపు గంట పాటు సీఎం జగన్ ఆశ్రమంలో ఉన్నారు. మీడియాతో మాట్లాడిన స్వామిజీ ప్రభుత్వానికి దన్నుగా మాట్లాడారు. పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

- కరోనా వల్ల ప్రపంచమే అతలాకుతలం కాగా రాష్ట్రంలో మాత్రం సంక్షేమ పథకాలు అమలయ్యాయి. సీఎం జగన్‌ హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడ్డారు. దేవాలయ భూముల రక్షణకు వ్యవస్థ రూపొందిస్తున్నారు. దీన్ని అందరూ అభినందించాలి. హైందవ మతానికి సీఎం విరుద్ధంగా ఉన్నట్లు గిట్టనివారంతా దుష్ప్రచారం చేస్తున్నారు.

- సీఎం జగన్‌ పరిపాలన మెరుగైన ఫలితాలను ఇస్తుంది. సంక్షేమ పథకాలను ఆయన అమలు చేస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. రామరాజ్యం కూడా ఒక్క రోజులో నిర్మించబడలేదు. రాముడు అయోధ్య నిర్మాణానికి కష్టపడ్డట్టు.. సీఎం జగన్‌ రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నారు.

- రాష్ట్రంలోని మురికిని కడిగేస్తున్నారు. ఈ ఏడాది కృష్ణవేణి మంచి పంటలు పండిస్తుంది. రైతులందరూ దిగుబడి బాగుండి సంతోషంగా ఉంటారు. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.

- రాష్ట్రానికి మంచి చేయాలనే ఉద్దేశం సీఎం జగన్‌లో చాలా ఉంది. ఆయన ఎంతో కష్టపడి, బాధలు తట్టుకొని పరిపాలన చేపట్టిన వ్యక్తి. ఆయన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేసింది.

- ప్రభుత్వం మంచి చేసేటప్పుడు అడ్డు పడటం సరికాదు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలవాలి. మనకు అది జరగలేదు.. ఇది జరగలేదు అని చాలా ప్రశ్నలు ఉంటాయి. అన్నీ ఒక్క రోజులో తీరి రామరాజ్యం కాలేదు కదా! రాముడి రాజ్యం వచ్చినా రాగులు విసరడం తప్పదు. కొన్ని అంశాల్లో మన కష్టం, మన పరిస్థితి, మనం చేసుకునేది ఎప్పటికీ తప్పదు.

- ఇప్పుడు హఠాత్తుగా ఓ ప్రవాహం వచ్చి నీళ్లు లోపలికి వస్తే గవర్నమెంట్‌ ఏమీ చేయలేదంటే.. ఏం చేస్తుంది? మనమే దానికేదో అడ్డుకట్ట వేసుకోవాలి. మురికి అంతా మనమే వేసుకొని గవర్నమెంట్‌ ఏం చేయడం లేదంటే ఎలా? మనం కూడా వలంటీర్లుగా పనిచేయాలి. ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలి.

- ఎప్పుడూ తప్పుబట్టడం, ఈ గవర్నమెంట్‌ ఏమీ పట్టించుకోదు అంటే ఎలా? మనం కూడా పట్టించుకోవాలి. విపత్తు వచ్చి నోటికాడికి వచ్చిన పంట నాశనమైతే వెంటనే ప్రభుత్వమైనా ఏం చేయగలదు? అప్పటికప్పుడే పంట మళ్లీ సృష్టించడానికి ప్రభుత్వానికైనా ఎలా సాధ్యమవుతుంది? వాళ్లూ మనుషులే కదా! అంత హింస పెట్టకూడదు.

- సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హిందూమతం పట్ల విరుద్ధంగా ఉన్నారని కొందరు ఊరికే ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం జరగడం పట్ల సీఎం జగన్‌ నా వద్ద దుఃఖం వ్యక్తం చేశారు. ఏ మతమైనా ఒక్కటేనన్న విధానంతో ఎవరి మనసూ నొప్పించకూడదన్నదే తన అభిమతమని సీఎం చెప్పారు. నాకూ మొదట నుంచీ అదే భావన ఉంది.

- హిందూ ధర్మం, హిందూ మతానికి సంబంధించి కొన్ని విషయాలపై నేను చేసిన సూచనలను సీఎం జగన్‌ శ్రæద్ధగా ఆలకించారు. ఆలయాల్లో చోటుచేసుకునే లోపాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా సరిచేస్తోంది. ఆలయ భూములు నాశనం కాకూడదు. ఆలయాల్లో వంశపారంపర్య అర్చక వ్యవస్థ కొనసాగించడం లాంటి అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించా.

- రాజ్యానికి రాముడొచ్చినా అయోధ్యలో ప్రజలు కష్టపడలేదా? అట్లానే మనం కూడా. ప్రజలందరూ గవర్నమెంట్‌కు సాధ్యమైనంత వరకు తోడ్పాటు అందించాలి. అప్పుడే రాష్ట్రం బాగుంటుంది. అభివృద్ధి చెందుతుంది. నీ రాజ్యం బాగా ఉంటుంది. ఆంధ్రరాష్ట్రం సాహిత్య రాజ్యం కావాలని సీఎంను దీవించి ప్రసాదం అందచేశా.


Tags:    

Similar News