ముక్కోణం అయితే వైసీపీకి చుక్కలేనా...?

Update: 2022-11-19 00:30 GMT
రాజకీయాలు అంటేనే అంత. వీటిని మాధమెటిక్స్ లెక్కలలో అసలు చూడకూడదు. పైగా గతంలో అలా జరిగింది కాబట్టి ఇపుడు ఇలా జరుగుతుంది అన్న అంచనాలూ ఆశలూ పెట్టుకోరాదు. ఎప్పటికపుడు మారిపోతూ ఉంటుంది. ప్రజల అభిప్రాయం ఎలా ఉంటే ఆ తీరుగానే రాజకీయం కూడా మలుపులు తిరుగుతుంది. అందువల్ల రాజకీయం అంటే అది ప్రవహించే నీరు లాంటిది. దాన్ని ఆపడం ఒక్క చోటనే నిశ్చలంగా ఉంచాలనుకోవడం అసాధ్యం, అసంభవం.

ఏపీ రాజకీయ విషయాలకు వస్తే వైసీపీ మరోసారి గెలవాలి అనుకుంటోంది. దానికి 2019 లెక్కలను, 2014 గణాంకాలను కూడా ముందేసుకుని కసరత్తు చేస్తోంది. 2019లో అయితే వైసీపీకి ఏకంగా 50 శాతానికి దగ్గరగా ఓట్ల షేర్ వచ్చింది. అయితే యాంటీ ఇంకెంబెన్సీ పెరుగుతుంది కాబట్టి అందులో ఒక అయిదు శాతం తగ్గినా 45 శాతం కచ్చితమని లెక్కలేసుకున్నా కూడా జనసేన టీడీపీ కాంబో కుదిరితే గెలుపు అటు వైపే ఉంటుందని కూడా అంచనా ఉంది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీకి దాదాపుగా నలభి శాతం ఓట్ల షేరింగ్ వచ్చింది. ఇక జనసేనకు ఆరు శాతం ఓట్లు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి.

ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఈజీగా 46 శాతం ఓట్ల వాటా సాధిస్తారు. అంటే వైసీపీకి ఎక్కడైతే అయిదు శాతం తగ్గుతుందో దాన్ని అధిగమించేస్తారు అని సింపుల్ లాజిక్ తో చెప్పేయవచ్చు. మరి ఈ రెండు పార్టీలు పొత్తులో లేకుండా విడిగా పోటీ చేస్తే వైసీపీకి లాభమని భావించే విశ్లేషణలు ఉన్నాయి. కానీ అది తప్పు కూడా కావచ్చు అని చెప్పే కొత్త లెక్కలూ ఉన్నాయి.

ఎలంగంటే తెలుగుదేశం జనసేన కలసి పోటీ చేస్తే రెండు పార్టీలలో అసంతృప్తి ఉంటుంది. పైగా జనసేనకు ఒక నలభై సీట్లు ఇస్తే ఆ మేరకు తమ్ముళ్ళు సహకరించే పరిస్థితులు ఉంటాయా అన్న డౌట్లు కూడా ఉన్నాయి. ఇక జనసేన టీడీపీ కలిస్తే కాపుల మద్దతు ఎంతమేరకు టీడీపీకి కొత్తగా దక్కుతుందో తెలియదు కానీ ఆ మేరకు సాలిడ్ గా పడే బీసీ ఓట్లు పోతాయి.

దాంతో విడిగా పోటీకి దిగితే కనుక ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలుతుంది అన్న లెక్కలు కూడా తప్పు అంటున్నారు. ఇపుడు అంతా సోషల్ మీడియా యుగం. కాబట్టి ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు వైసీపీని గట్టిగా ఢీ కొట్టగలరు అన్న అంచనాలు ఎప్పటికపుడు ఓటరు దగ్గర ఉంటాయి. దాంతో ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతను తమ వైపునకు లాగేసుకోగల పార్టీకే జనాలు ఓటు వేస్తారు. ఆ విధంగా చూస్తే టీడీపీకి విడిగా పోటీ చేయడమే మేలు అన్న అంచనాలు ఉన్నాయట.

ఇంకో వైపు తీసుకుంటే జనసేన టీడీపీతో కలిస్తే కాపుల ఓట్లు నూరు శాతం ఆ పార్టీకి టర్న్ అయ్యే చాన్స్ లేదు అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు సీఎం అవుతారు అన్నది రూఢీ అయిపోతుంది కాబట్టి. అదే జనసేన విడిగా పోటీ చేస్తే ఈ అయిదేళ్లలో పెరిగిన గ్రాఫ్ తో పాటు కాపులంతా పోలరైజ్ అవుతున్న క్రమంలో సాలిడ్ గా ఓట్లు ఆ పార్టీకే వెళ్తాయని అంటున్నారు.

అపుడు సామాజికపరంగా చూసుకుంటే కాపులకు ఫస్ట్ చాయిస్ గా జనసేన ఉంటుంది. సెకండ్ చాయిస్ గా టీడీపీ ఉంటుంది. థర్డ్ చాయిస్ గా మాత్రమే వైసీపీ ఉంటుంది. అలా వైసీపీకి గోదావరి జిల్లాలలో భారీ నష్టం తప్పదని లెక్కలేఅతున్నారు. ఇక అదే తీరున బీసీ ఓట్లను తీసుకుంటే అవి సాలిడ్ గా టీడీపీకే పడవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ సోలోగానే పోటీ చేస్తుంది కాబట్టి. అపుడు సెకండ్ ప్లేస్ లో వైసీపీ ఉంటుంది.

అలా కాపుల బీసీల ఓట్లు ఏపీ టోటల్ ఓట్లలో డెబ్బై శాతం దాకా ఉంటే అందుకో వైసీపీ ఓట్ల షేర్ కి బాగా కన్నం పడే చాన్స్ ఉంటుంది అని అంటున్నారు. మరో వైపు ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంటే దాన్ని రెండు విపక్ష పార్టీలూ తమ పర్ఫార్మెన్స్ తో కొల్లగొడితే  కొన్ని సీట్లలో వైసీపీ మూడవ స్థానంలోకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.

ఈ విధంగా చూస్తే కనుక ఏపీలో ముక్కోణంపు పోటీలో నిండా మునిగేది వైసీపీయే అని కూడా చెబుతున్నారు. అదే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే హిట్ అవుతుందని చెప్పలేరు. ఇక దానికి ఎన్నో మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి కాబట్టి వైసీపీకి అది ఎంతో కొంత ఊరట ఇచ్చే చాన్స్ ఉంటుందని అంటున్నారు. అందువల్ల పొత్తులు ఉండడం కంటే లేకపోవడం వల్లనే వైసీపీకి ఇబ్బంది అని ఒక వైపు నుంచి బాబు మరో వైపు నుంచి పవన్ చెడుగుడు మొదలెడితే అధికార పార్టీకి పద్మవ్యూహమే అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News