మీరు అనవసరమైన ఆందోళన చెందకూడదంటే దీన్ని చదవాలి

Update: 2022-05-12 03:29 GMT
సోషల్ మీడియా.. వాట్సాప్ పుణ్యమా అని కొన్ని నిజాలు నిమిషాల వ్యవధిలో తెలిసిపోతుంటే.. కొన్ని అసత్యాలు అంతే వేగంగా మనకు చేరిపోవటమే కాదు.. కొత్త టెన్షన్లు పుట్టించి విలువైన సమయాన్ని.. అంతకు మించిన ఆందోళనకు గురి చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. ఇప్పుడు అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. రూ.500 నోటుకు సంబంధించిన ఒక పోస్టు వాట్సాప్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని రూ.500 నోట్లు చెల్లవంటూ పేర్కొన్న పోస్టులో ఉన్న అంశాల్ని చూసి కొందరు తీవ్ర  ఆందోళనకు గురవుతున్నారు.

అలాంటి వారికి క్లారిటీ కోసమే తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ (పీబీఐ) తాజాగా ఒక ట్వీట్ చేసి పలువురి సందేహాలు తీరిపోయేలా పోస్టు చేశారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇదే.. ఇందులో నిజం లేకున్నా.. అదే నిజమని చాలామంది భావిస్తుంటారు. ఇంతకీ ఆ తప్పుడు సమాచారం ఏమంటే..

‘‘ఓ 500 రూపాయల నోటుపై గాంధీ బొమ్మ.. ఆకుపచ్చ గీతకు దగ్గరగా RBI గవర్నర్ సంతకంపైన.. ఉన్న నోటు నకిలీది’’ అని. దీనికి ఆర్బీఐ ఇచ్చిన తాజా క్లారిటీ ఏమిటంటే..

‘‘నోటుపై ఉన్న గాంధీ బొమ్మ.. ఆకుపచ్చ గీతకు దగ్గరగా.. దూరంగా ఉన్న రెండు నోట్లు సరైనవే. ఆర్బీఐ ప్రకారం రెండు రకాల నోట్లు చెల్లుబాటు అవుతాయి. కొత్తగా విడుదల అవుతున్న రూ.500 నోట్ల ప్రస్తుత రంగు.. పరిమాణం.. థీమ్.. భద్రతా ఫీచర్ల స్థానం.. డిజైన్ అంశాలు పాత నోట్లకు కాస్త భిన్నంగా ఉంటాయి. కొత్త నోటు పరిమాణం 66mm x 150mm ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాల్ని అస్సలు నమ్మొద్దు’’ అని స్పష్టం చేసింది.

అదే సమయంలో ఏదైనా అంశం మీద అనుమానం ఉంటే.. ఆర్బీఐ పాయింటర్లు.. ప్రభుత్వ నిజ నిర్దారణ సంస్థ ద్వారా తెలుసుకోవాలే తప్పించి.. అనవసరమైన ఆందోళన వద్దని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తల్ని నమ్మొద్దంటే నమ్మొద్దని తేల్చి చెప్పింది. సో.. రూ.500 నోట్ల మీద వచ్చే వార్తల్ని అస్సలు నమ్మొద్దు. ఒకవేళ అనుమానం వస్తే క్రాస్ చెక్ చేసుకోండే తప్పించి.. టెన్షన్ పడమాకండి.
Tags:    

Similar News