నిశ్చితార్థం రోజున 100 మందితో దాడి చేసి కిడ్నాప్.. వైశాలి దొరికింది.. జాడలేని నవీన్

Update: 2022-12-10 07:30 GMT
పెళ్లికి నిరాకరించిందని.. తనను కాదని వేరొకరితో నిశ్చితార్థం చేసుకుంటున్న యువతి ఇంటిపై 100 మందితో కలిసి దాడి చేసి ఆ యువతిని కిడ్నాప్ చేశాడు ఓ భగ్న యువకుడు. ఇది ఆద్యంతం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమించిన అమ్మాయిని ఎత్తుకెళ్లిపోయిన ఘటన హైదరాబాద్ శివారు మన్నెగూడలో కలకలం సృష్టించింది. ఆమె ఇంట్లోకి 100 మందిని తీసుకొచ్చి దౌర్జన్యం చేసి కుటుంబసభ్యులపై కర్రలు, కత్తులతో దాడి చేసి యువతిని కిడ్నాప్ చేశారు. యువతి బంధువులు జాతీయ రహదారిపై భైఠాయించి నిరసన తెలిపారు. కిడ్నాప్ చేసిన యువకుడి టీ దుకాణాన్ని తగులబెట్టారు. పోలీసులు ఘటన జరిగిన 6 గంటలలోపే అమ్మాయిని రక్షించారు. నిందితులను అరెస్ట్ చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లా ముచ్చర్లపల్లికి చెందిన దామోదర్ రెడ్డి సైన్యంలో పనిచేసి కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మన్నెగూడలో కుటుంబంతో స్థిరపడ్డాడు. కుమార్తె (24) నగరంలో బీడీఎస్ చదువుతోంది. బెంగళూరులోని ఓ బాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో ఈమెకు హస్తినాపురంకు చెందిన మిస్టర్ టీ కంపెనీ ఎండీ కే.నవీన్ రెడ్డి(29)తో 2021లో పరిచయం ఏర్పడింది. ఇతడి స్వస్థలం నల్గొండ జిల్లా ముషంపల్లి. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. రెండు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకొని గోవా, వైజాగ్ సహా పర్యాటక ప్రాంతాలు చుట్టి వచ్చాయి.

అయితే పెళ్లి విషయంలో కుటుంబాల మధ్య మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి నవీన్ రెడ్డిని దూరంగా ఉంచారు. నవీన్ వాట్సాప్ మెసేజ్ లు పంపుతుండడంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెయిల్ పై బయటకు వచ్చిన నవీన్ రెడ్డి తన మకాంను యువతి ఇంటి దగ్గరకు మన్నెగూడకు మార్చాడు. యువతి ఇంటి సమీపంలోనే ఖాళీ ఫ్లాట్ ను తీసుకొని రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. తనను కాదంటే ఎవరికీ దక్కనివ్వనంటూ యువతిని బెదిరిస్తున్నాడు.

గత ఏడాది ఆగస్టు 4న ఏపీలోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల గ్రామంలోని దేవాలయంలో తాను యువతి పెళ్లి చేసుకున్నామని.. ఆమె చదువు పూర్తయ్యేవరకూ పెళ్లి విషయం చెప్పవద్దని తండ్రి కోరితే ఆపామాని నిందితుడు నవీన్ రెడ్డి కోర్టులో కేసు వేశాడు. ఆ యువతి తన భార్య అని.. మనసు మార్చి వేరే పెళ్లి చేస్తున్నారని ఆధారాలను కోర్టుకు, పోలీసులకు చూపించాడు.

అయితే తాజాగా యువతికి మరొకరితో వివాహం కుదిర్చి శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నిశ్చయ తాంబూలాలు మార్చుకుంటున్నారని నవీన్ రెడ్డికి తెలిసింది. దీంతో 5 కార్లు, డీసీఎం వ్యాన్ లో సుమారు 100 మందితో నవీన్ రెడ్డి వచ్చి యువతి ఇంటిపై దాడి చేశాడు. ఫర్నిచర్, సీసీటీవీలు ధ్వంసం చేసి యువతిని కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. పక్కా రెక్కీతో ఇదంతా చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై ధర్నా చేయడం.. పోలీసులు ఆ యువతిని కాపాడి రెస్క్యూ చేశారు. పోలీసులు యువతిని రహస్య ప్రదేశంలో ఉంచి తండ్రికి చూపించారు. యువతి నల్లగొండలో ఉన్నట్టు ఫోన్ సిగ్నల్స్ ద్వారా తెలుసుకొని పోలీసులు ఆమెను కాపాడారు.

ఈ కేసులో దాడిలో పాల్గొన్న మొత్తం 28మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. యువతి షాక్ లో ఉందని.. ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News