రాజమండ్రి ఎంపీ భరత్ కార్యాలయంలో కరోనా కలకలం!!

Update: 2020-07-02 14:47 GMT
రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు భరత్ కార్యాలయంలో కరోనా కలకలం చెలరేగింది. భరత్ గన్‌మెన్, వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఎంపీ భరత్ - అధికారులు అప్రమత్తమయ్యారు. కార్యాలయంలోని సిబ్బందిని మొత్తం క్వారంటైన్‌ లో ఉంచాలని భరత్ భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వేగంగా వ్యాప్తిస్తోంది. ఇది ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.

కార్యాలయ సిబ్బంది - ఇతరులకు గతంలోనే కరోనా పరీక్షలు నిర్వహించారు. 35 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ వచ్చింది. కానీ తాజాగా గన్‌ మెన్ - ఫోటో గ్రాఫర్‌ కు కరోనా సోకడం ఆందోళన కలిగించింది. ఎంపీ భరత్ కూడా తాను ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకున్నారు.

ఫోటోగ్రాఫర్ - గన్‌ మెన్ చాలామందిని కలిశారు. వారు ఎవరెవరిని కలిశారో ఆరా తీసి, వారికి కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. వారి కుటుంబ సభ్యులకు టెస్టులు చేయనున్నారు. కార్యాలయానికి కూడా కొంతమంది వచ్చి వెళ్లారు. వారు ఎవరెవరని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు 16వేలకు పైగా ఉన్నాయి. మరణాలు దాదాపు 200 వరకు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కారణంగా 24 మంది వరకు మృతి చెందగా, 1500 కేసులు నమోదయ్యాయి. ఇందులో 500 కేసులు ముంబై, హైదరాబాద్ ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉన్నారు.
Tags:    

Similar News