చలానా మేళ.. మొదటి రోజు ఆదాయం రూ.5.5కోట్లు

Update: 2022-03-02 06:38 GMT

ఏడా పెడా తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానాల విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకోవటం.. కోట్ల కొద్ది చలానాల సొమ్ము ఖజానాకు చేరకపోవటం.. లక్షలాది కేసులు పెండింగ్ లో ఉండిపోయిన నేపథ్యంలో.. వాటన్నింటిని వైట్ వాష్ చేయాలన్న ఆలోచనతో చలానాల రాయితీ మేళాను తెర మీదకు తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర పోలీస్. దీనికి సంబంధించిన ప్రకటన చేయటం.. వేలాది రూపాయిలుగా ఉన్న చలనాల్ని.. భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వటం ద్వారా.. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ క్లియర్ చేయలేమన్న భావనను ప్రజలకు కల్పించటంలో తెలంగాణ పోలీసు సక్సెస్ అయ్యింది.

ట్రాఫిక్ చలానా క్లియరెన్సు కోసం మొదలైన మేళాకు.. మొదటి రోజున విశేషమైన స్పందన లభించింది. తొలిరోజే కాసుల కళకళతో ఖజానా మెరిసింది. పండుగ పూట.. చలానాల గురించి ప్రజలు ఏం ఆలోచిస్తారన్న ఆలోచన తప్పన్న భావనను కలిగించింది. చలానా మేళా మొదటి రోజున రూ.5.5 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. నిమిషానికి వెయ్యికి పైనే చలానాల చెల్లింపులు జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ విభాగ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలోచలానాల చెల్లింపులు జరగటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

చెల్లింపులు జరిగిన చలానాల్లో బైకులకు 75 శాతం.. కార్లు.. లారీలకు50 శాతంతో పాటు.. తోపుడు బండ్లకు 80 శాతం రాయితీ ఇవ్వటంతో.. వాటిచెల్లింపులకు ఆన్ లైన్ లో ఎవరికి వారుప్రయత్నాలు చేశారు. ఈ రద్దీని ముందుగానే అంచనా వేసిన పోలీసులు అందుకు తగ్గట్లే సర్వర్ సైజును భారీగా పెంచేసి.. రద్దీ వచ్చినా తట్టుకునేలా ఏర్పాట్లు చేసినా.. అంచనాలకు మించిన స్పందన ఉందని చెబుతున్నారు.

తొలుత సాంకేతికంగా కాసిన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఆ సమస్యల్ని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ విభాగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంతో.. ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయగలిగారు. మొత్తంగా తొలిరోజు రూ.5.5 కోట్ల ఆదాయం రావటం.. ఈ నెలాఖరు వరకు ఈ చలానాల్ని క్లియర్ చేసుకునే అవకాశం ఉండటంతో.. ఇప్పుడున్న పెండింగ్ చలానాలు దాదాపుగా క్లియర్ అవుతాయన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News