జాబ్ చేస్తున్న పోలీసు భార్య ఇంట్లో ఎక్కువగా ఉండట్లేదని కాల్చేశాడు

ప్రాధాన్యతలు.. ప్రాధామ్యాలు మారిపోయాయి. గతంలో భార్య ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదనే పట్టుదలతో ఉండే భర్తలు పెద్ద ఎత్తున ఉండేవారు.

Update: 2023-10-23 17:30 GMT

ప్రాధాన్యతలు.. ప్రాధామ్యాలు మారిపోయాయి. గతంలో భార్య ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదనే పట్టుదలతో ఉండే భర్తలు పెద్ద ఎత్తున ఉండేవారు. మారిన కాలానికి అనుగుణంగా భార్య ఉద్యోగం చేయాలి.. ఇంటి పనులు చేయాలన్నట్లుగా పరిస్థితులు మారాయి. అందరూ కాదు కానీ.. ఇంటి బాధ్యతలు.. ఉద్యోగం చేసే విషయంలో తేడా రాకుండాచూసుకోవాల్సిన అవసరం ఈ తరం భార్యల మీద పడుతోంది. ఇప్పుడు చెప్పే ఉదంతం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. ఇలా కూడా చేస్తారా? అన్న షాక్ కు గురవుతారు.

బీహార్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే తన భార్య.. ఇంట్లో ఎక్కువసేపు ఉండట్లేదన్న కోపంతో కాల్చి చంపేసిన భర్త ఉదంతం షాకింగ్ గా మారింది. రాష్ట్ర రాజధాని పాట్నాకు చెందిన శోభాకుమారిని ఆమె భర్త కాల్చి చంపిన ఉదంతం సంచలనంగా మారింది. ఎప్పుడు ఉద్యోగం మీదనే తప్పించి ఇంట్లో ఉండట్లేదన్న ఆరోపణలై ఆమెను పిస్టల్ తో కాల్చేసినట్లుగా చెబుతున్నారు. వీరిది ప్రేమ వివాహం కావటం గమనార్హం.

జెహనాబాద్ కు చెందిన గజేంద్ర యాదవ్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుంటాడు. ఆరేళ్ల క్రితం అతడికి శోభాకుమారితో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. అనంతరం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె. ఈ మధ్యనే శోభాకుమారికి పోలీసు కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. దీంతో.. ఆమె బిజీగా మారిపోయారు. ఉద్యోగ బాధ్యతలతో తలమునకలు కావటం.. పోలీసు ఉద్యోగం అంటేనే.. టైం విషయంలో తేడాలు ఉండటం తెలిసిందే.

దీంతో.. ఇంట్లో ఎక్కువగా ఉండకుండా పోలీస్ స్టేషన్ లోనే ఎక్కువగా గడుపుతుందంటూ భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో హోటల్ గది బుక్ చేసి.. భార్యను రావాల్సిందిగా కోరాడు. అక్కడకు వెళ్లిన ఆమెతో టైం కేటాయించట్లేదని పేర్కొంటూ గొడవ పడ్డాడు. కోపంతో ఊగిపోతు తన వద్ద ఉన్న పిస్టల్ తో ఆమెను కాల్చి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు భర్త కోసం గాలింపులు చేపట్టారు.

Tags:    

Similar News