ఆలియా 'నాటు నాటు' ఆట.. 'ఊ అంటావా మావా' పాట!

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తెలుగు పాట పాడటమే కాదు, డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

Update: 2024-10-08 17:20 GMT

బాలీవుడ్ భామ ఆలియా భట్‌ RRR సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెర మీద తన పాత్ర కనిపించింది కాసేపే అయినా, మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తెలుగులో ఆమెకున్న క్రేజ్ ను వాడుకుంటూ తన సినిమాలను డబ్బింగ్ చేసి ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆమె నటించిన బ్రహ్మాస్త్రం, గంగూబాయి కథియావాడి చిత్రాలు తెలుగులోనూ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు 'జిగ్రా' అనే సినిమాతో వస్తోంది అలియా. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తెలుగు పాట పాడటమే కాదు, డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

పాన్ ఇండియాకి తెలుగు మార్కెట్ కూడా కీలకంగా మారడంతో ఆలియా భట్ తన 'జిగ్రా' సినిమాని టాలీవుడ్ లోనూ దూకుడుగా ప్రమోట్ చేస్తోంది. మంగళవారం హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. దీనికి అలియాతో పాటుగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో రానా దగ్గుబాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలియా ట్రిపుల్ పాటకు స్టెప్పులేయడమే కాదు, పుష్ప సాంగ్ పాడి అలరించింది.

'మగధీర' చిత్రంలోని ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ అనే డైలాగ్ చెప్పమని యాంకర్ సుమ కోరగా.. నేను ఏం చేయగలనో మీకు తెలుసంటూ RRR లోని 'నాటు నాటు' పాటకు డ్యాన్స్ చేసింది అక్కడున్న వారందరినీ నవ్వించింది ఆలియా భట్. అలానే 'పుష్ప' సినిమాలోని 'ఊ అంటావా మావా.. ఊహూ అంటావా' పాటను తెలుగులో పాడింది. సమంత కోసమే ఈ సాంగ్ పాడుతున్నట్లుగా చెప్పింది. దీనికి పక్కనే ఉన్న సామ్ సంతోషం వ్యక్తం చేయగా.. త్రివిక్రమ్ చప్పట్లు కొట్టి అలియాని ప్రశంసించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల 'దేవర' ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, కొరటాల శివతో నిర్వహించిన ఇంటర్వ్యూలో 'చుట్టమల్లే' పాట పాడింది అలియా భట్. ఇప్పుడు 'జిగ్రా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు పాటలకు ఆడి పాడింది. ఈ క్రమంలో ఆలియా భట్ మాట్లాడుతూ.. 'మంచి సినిమాను ప్రేమించడంలో ఎవరైనా తెలుగు ఆడియన్స్ తర్వాతే' అని కొనియాడింది. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ రెండింట్లోనూ సమంత ఓ హీరో అంటూ ఆకాశానికి ఎత్తేసింది. సామ్ తో కలిసి నటించడానికి మంచి స్క్రిప్ట్ రెడీ చేయాల్సిందిగా త్రివిక్రమ్ ను కోరింది. ఇదంతా చూస్తుంటే ఆలియా తెలుగు మీద బాగానే ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి మన టాలీవుడ్ స్టార్స్ సైతం సపోర్ట్ గా నిలుస్తున్నారు. జిగ్రా చిత్రాన్ని తెలుగులో రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తమ్ముడు కోసం అక్క చేసే పోరాటం నేపథ్యంలో 'జిగ్రా' చిత్రం తెరకెక్కింది. ఇందులో అలియాభట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. వాసన్‌ బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇది విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 11న పాన్ ఇండియా వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఆలియా భట్ కు ఈ యాక్షన్ డ్రామా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News