సంబరాల వేళ అఖిల్ ఉద్వేగం

Update: 2015-09-16 10:08 GMT
అక్కినేని అభిమానుల ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. ఇంకో నాలుగు రోజుల్లో అక్కినేని కొత్త కెరటం అఖిల్ అరంగేట్ర సినిమా ‘అఖిల్’ ఆడియో ఫంక్షన్ జరగబోతోంది. తెలుగు సినిమా చరిత్రలోనే నభూతో అనే రీతిలో ఈ ఆడియో ఫంక్షన్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ఏ అరంగేట్ర హీరోకు లేనంత హంగామా అఖిల్ ఆడియో ఫంక్షన్ కు చూడబోతున్నాం.

మామూలుగా ఎంత పెద్ద ఫ్యామిలీ హీరో అరంగేట్ర సినిమా అయినా శిల్ప కళావేదికలోనో, ఇంకేదైనా పెద్ద ఆడిటోరియంలోనో ఆడియో ఫంక్షన్ చేస్తారు. కానీ అఖిల్ కు మాత్రం ఏకంగా ఏ స్టేడియాన్నే బుక్ చేశారు. గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియంలో ఈ నెల 20న భారీ లెవెల్లో ఆడియో రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. స్టేడియంలో అంటే.. లక్షల మంది అభిమానులు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆదివారం సందడి ఎలా ఉండబోబోతోంది అర్థం చేసుకోవచ్చు.

ఈ వేడుకలో అఖిల్ ఏం మాట్లాడతాడు.. ఏదైనా పెర్ఫామ్ చేస్తాడా.. డైలాగులు చెబుతాడా.. స్టెప్పులేస్తాడా.. అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీలో అందరూ దాదాపుగా క్లాస్ హీరోలే. అఖిల్ మాత్రం మాస్ ఇమేజ్ తెచ్చుకుంటాడని ఆశిస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు ఈ ఫంక్షన్లో పాల్గొనబోతున్నారు. ఐతే ముఖ్య అతిథి ఎవరన్నది ఇంకా తేలలేదు. పవన్, మహేష్.. ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ ప్రతిష్టాత్మక వేడుకకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అఖిల్ చాలా ఉద్వేగంగా స్పందించాడు. చాలా నెర్వస్ గా ఫీలవుతున్నానని.. ఈ సమయంలో తాతయ్య నాగేశ్వరరావు లేకపోవడం చాలా బాధగా ఉందని.. ఐతే ఆయన ఆడియో ఫంక్షన్లోనే ఉంటారని, తనను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశాడు అఖిల్. అభిమానుల్ని ఆనందపరచడానికి అనేక కార్యక్రమాలు ఉండబోతున్నాయని.. ఆస్వాదించడానికి రెడీగా ఉండాలని చెప్పాడు.
Tags:    

Similar News