పేరూ పోయె.. డబ్బూ పోయె

Update: 2018-05-13 08:53 GMT
టాలీవుడ్లో నిర్మాతగా దిల్ రాజుకు ఉన్న గుర్తింపు ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందరో పేరు మోసిన నిర్మాతలు ఇక్కడ మనుగడ సాగించలేక నిష్క్రమించగా.. సురేష్ బాబు.. అల్లు అరవింద్ లాంటి కొద్ది మంది మాత్రమే ఇక్కడ నిలవగలిగారు. ఐతే రాజు నిర్మాతగా ఆరంభంలోనే తనదైన ముద్ర వేసి.. ఈ తరంలో గొప్ప ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. సురేష్.. అరవింద్ లాంటి వాళ్ల గౌరవం కూడా తెచ్చుకుని వాళ్ల సరసన నిలిచాడు. ఇంకా చెప్పాలంటే వాళ్లను మించిన క్రెడిబిలిటీ కూడా సంపాదించుకున్నాడు.  రాజు సినిమా అంటే కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోవచ్చన్న భరోసా ప్రేక్షకుల్లో కలిగేలా చేసుకున్నాడు. ఐతే ఇన్నాళ్లూ ఆ క్రెడిబిలిటీని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన రాజు.. ఈ మధ్య పట్టు కోల్పోతున్నారు. తనవి కాని సినిమాల్ని చేతికి తీసుకుని.. వాటి గురించి గొప్పగా చెబుతున్న రాజు ఆ సినిమాలు తేడా కొట్టేసరికి ప్రేక్షకుల నమ్మకం కోల్పోతున్నాడు.

ఈ కోవలో వచ్చిన కొత్త సినిమా ‘మెహబూబా’. దీని గురించి విడుదలకు ముందు ఓ రేంజిలో చెప్పాడు రాజు. ఆయన ఎంతో నమ్మకంగా ఈ చిత్రాన్ని రూ.9 కోట్లకు హోల్ సేల్ గా కొనేశాడు. కానీ ఈ చిత్రానికి బ్యాడ్ టాక్ వచ్చింది. సినిమా చూసి పూరిని తిడుతున్న వాళ్లు.. అదే నోటితో రాజునూ తిట్టిపోస్తున్నారు. ఇలాంటి సినిమా గురించి అంతలా చెప్పాడేంటని విమర్శిస్తున్నారు. ఈ రకంగా ఆయన ఆల్రెడీ పేరు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆయన పెట్టుబడికీ ఎసరు తప్పదని తేలిపోయింది. ‘మహానటి’ ప్రభంజనం సాగుతున్న సమయంలో వచ్చిన ఈ చిత్రానికి ఓపెనింగ్సే లేవు. పైగా టాక్ బ్యాడ్. దీంతో ఓపెనింగ్ వీకెండ్ వసూళ్లు దారుణంగా ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. ఇక వీకెండ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. రాజు పెట్టుబడిలో సగం కూడా వెనక్కి రావడం కష్టమే. మొత్తానికి రాజు రెండు విధాలా చెడాడు ఈ సినిమా వల్ల.
Tags:    

Similar News