రాజుగారిలో మునుపటి జోష్ కనిపించడం లేదే!

Update: 2019-11-19 06:34 GMT
టాలీవుడ్ లో ఉండే సక్సెస్ ఫుల్ నిర్మాతలలో దిల్ రాజు ఒకరు.  అటు పంపిణీదారుడిగా ఇటు నిర్మాతగా ఆయన అద్భుతమైన విజయాలు సాధించారు. ఒక దశలో ఏడాదికి ఐదారు సినిమాలు నిర్మిస్తూ ఊపిరి సలపనంత బిజీగా మారిపోయారు.  అయితే ఈమధ్య మాత్రం రాజుగారిలో మునుపటి జోష్ కనిపించడం లేదని అంటున్నారు.

ఈమధ్య కాలంలో దిల్ రాజు ఖాతాలో ఉన్న ఏకైక హిట్ 'F2' మాత్రమే. అది కాకుండా మిగతా సినిమాలతో అయన ఇమేజ్ తగ్గిందే కానీ పెరిగింది లేదు.  ఆయన బ్యానర్ నుండి కొన్ని సినిమాలను రిలీజ్ చేస్తే అవి విడుదల అవుతున్న సంగతి కూడా చాలామందికి తెలియడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.  'ఎవరికీ చెప్పొద్దు'.. 'ఆవిరి' లాంటి సినిమాలతో అయన ఆర్థికంగా ఏ మేరకు నష్టం వాటిల్లిందో తెలియదు కానీ రాజు గారి ఇమేజ్ మాత్రం తగ్గింది. ఇదిలా ఉంటే రాజుగారు ప్రస్తుతం టేకప్ చేసిన ప్రాజెక్టుల విషయంలో కూడా మునుపటి వేగం కనిపించడం లేదు.  '96' రీమేక్ అప్డేట్స్ రావడంలేదు.. నిజానికి డిసెంబర్ లోనే ఆ సినిమా రావాల్సి ఉన్నా ఫిబ్రవరికి మార్చారట.  రాజుగారు నిర్మిస్తున్న మరో సినిమా 'ఇద్దరి లోకం ఒకటే' విషయంలో పెద్దగా బజ్ లేదు.   ఈ సినిమాపై హైప్ పెంచేందుకు రాజుగారు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.

పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' విషయంలో రాజు గారి పాత్ర ఏమీ లేదని.. జస్ట్ పేరు మాత్రమే ఉంటుందనే టాక్ ఇప్పటికే ఉంది.  నైజాం రైట్స్ తప్ప ఈ సినిమాతో పెద్దగా రాజుగారికి సంబంధం లేదని  అంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తో 'పింక్' సినిమా రీమేక్ ప్లాన్ చేస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి సంయుక్తంగా నిర్మించాలనేది రాజుగారి ప్లాన్.. అయితే ఈ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కే వరకూ సందేహమే.  ఇవన్నీ చూస్తున్న వారు దిల్ రాజు ప్రాజెక్టులలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదని కామెంట్ చేస్తున్నారు.
Tags:    

Similar News