పవన్ ఫ్యాన్స్ నాకు వార్నింగ్ ఇచ్చారు: దర్శకుడు క్రిష్

Update: 2021-04-05 03:30 GMT
పవన్ అభిమానులంతా కూడా ఆయన తాజా చిత్రంగా రానున్న 'వకీల్ సాబ్' కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రాజకీయాలలోకి వెళ్లిన తరువాత పవన్ చేసిన ఫస్టు మూవీ ఇది. అందువలన ఇటు అభిమానుల్లోను .. అటు ఇండస్ట్రీలోను ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా సృష్టించనున్న సరికొత్త రికార్డులను గురించి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఈ నెల 9న థియేటర్లలో దిగిపోనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఆదివారం రాత్రి) శిల్పకళా వేదికలో మంచి సందడిగా జరిగింది.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో 'హరిహర వీరమల్లు' సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు క్రిష్, 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ వేదికపై  మాట్లాడారు. "ఫ్యాన్స్ లందు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వేరయా అంటారు. మొన్న 'వీరమల్లు' షూటింగులో లంచ్ టైమ్ లో ట్విట్టర్ ఓపెన్ చేశాను. దాదాపు ఓ పదిమంది .. మీరు షూటింగు చేస్తున్న లొకేషన్ లో ఈ రోజు ఎండ ఇంత ఉంది .. కల్యాణ్ గారిని జాగ్రత్తగా చూసుకోండి" అని వార్నింగ్ ఇచ్చారు. జనరల్ గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ గారి ఫిల్మ్ ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతున్నాయి.

ముందుగా 'వకీల్ సాబ్' దిగ్విజయంగా జయభేరి మోగించబోతోంది. ఇంతగొప్ప ఇతివృత్తాన్ని పవన్ కల్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లిన 'దిల్' రాజు గారికి నేను శతకోటి వందనాలు చెబుతున్నాను. ఈ కథ చాలా సున్నితంగా చెప్పవలసిన అంశం. అందుకు తగిన డైరెక్టర్ గా వేణు శ్రీరామ్ ను ఎంపిక చేసుకోవడం విశేషం. ఈ కథ తన ద్వారా జనంలోకి వెళ్లాలనే ఉద్దేశంతో అంగీకరించిన పవర్ స్టార్ కి అందరం కలిసి 'హోయ్' కొడదాం. ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని ఆశిస్తూ .. ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.      
Tags:    

Similar News