పవన్ ఓ హిమాలయం .. నేను మామూలు టైలర్ కొడుకును: వేణు శ్రీరామ్

Update: 2021-04-05 05:30 GMT
'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి శిల్పకళావేదికలో వైభవంగా జరిగింది. 'దిల్' రాజు నిర్మించిన ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమా చేసే అవకాశం నాకు అనుకోకుండా వచ్చింది. ఈ ప్రాజెక్టును గురించి 'దిల్' రాజుగారు నాకు ముందుగా చెప్పారు. ఆ తరువాత పవన్ గారిని కలిసే విషయమై త్రివిక్రమ్ తో మాట్లాడారు. ఒక రోజున త్రివిక్రమ్ గారు నాకు కాల్ చేసి, పవన్ ను కలవాలి వచ్చేయమని అన్నారు. అక్కడి నుంచి త్రివిక్రమ్ గారు నన్ను వెంటబెట్టుకుని పవన్ దగ్గరికి తీసుకుని వెళతారేమోనని నేను అనుకున్నాను.

నేను త్రివిక్రమ్ గారి ఇంటికి వెళ్లిన తరువాత త్రివిక్రమ్ గారు తన రూమ్ లో నుంచి బయటికి వచ్చారు. ఆయన డోర్ తీయగానే లోపల ఒక కటౌట్ ఉంది .. ఆ కటౌట్ పేరే పవన్ కల్యాణ్. ఆయన పూర్తి వైట్ డ్రెస్ లో ఉన్నారు. ఆయనను చూస్తూ ఆ గదిలోకి అడుగుపెడుతూ ఉంటే, ఒక గుడిలోకి అడుగుపెడుతున్నట్టుగా అనిపించింది. నేను చిన్నప్పుడు హిమాలయ పర్వతాలను గురించి చదివాను .. ఆ తరువాత వాటిని దగ్గర నుంచి చూశాను. ఆ హిమాలయాల దగ్గర ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపించింది. అలాంటి ప్రశాంతత మళ్లీ నాకు పవన్ గారి ఎదురుగా కూర్చున్నప్పుడు కలిగింది.

'తొలిప్రేమ' 100 రోజులు ఆడిన సమయంలో సంధ్య థియేటర్లో హరీశ్ శంకర్ గారు .. 'దిల్' రాజుగారు ఉన్నట్టుగా చెప్పారు. ఇందులో చిన్న ట్విస్ట్ ఏమిటంటే ఆ రోజున ఆ థియేటర్లో నేను కూడా ఉన్నాను. కానీ నేను ఒక దర్శకుడిని అవుతానని మాత్రం అనుకోలేదు. ఆ రోజున 'తొలిప్రేమ' సినిమా 4 షోలను వరుసగా చూశాను. పవన్ కోరుకుంటే దేశంలోని డైరెక్టర్లంతా క్యూలో ఉంటారు. కానీ ఆయన నాకు అవకాశం ఇచ్చారు ... ఓ మామూలు టైలర్ కొడుకును నేను. ఆయన నాకు ఛాన్స్ ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం" అని చెప్పుకొచ్చాడు. 
Tags:    

Similar News