'సైకో బ‌యోపిక్‌'కు వ‌ర్మ ఓకే అంటాడా?

Update: 2020-02-01 07:27 GMT
'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' చిత్రం విడుద‌ల‌కు ముందు రచయిత జొన్నవిత్తుల, ద‌ర్శ‌కుడు ఆర్జీవీల‌ మధ్య వెర్బ‌ల్ వార్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. వ‌ర్మ వ్య‌వ‌హార శైలిని జొన్న విత్తుల తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. వర్మ చిత్రాల‌ టైటిల్స్‌...ఆ సినిమాల ప్రమోషన్ కోసం వ‌ర్మ చేసే ఫీట్లపై జొన్నవిత్తుల అభ్యంతరం వ్యక్తం చేశారు. లైవ్ డిబేట్ల‌లో కూడా వ‌ర్మపై విమ‌ర్శ‌లు గుప్పించారు. చాలా సంద‌ర్భాల్లో వ‌ర్మ‌ శ్రుతిమించార‌ని, వ‌ర్మ‌పై ఏకంగా ఓ బయోపిక్ తీస్తానని జొన్న‌విత్తుల స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ బ‌యోపిక్‌కు 'ఆర్జీవీ' అనే టైటిల్‌....`సైకో బయోపిక్` అనే ట్యాగ్ లైన్ కూడా ఫిక్స్ చేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా జొన్నవిత్తులకు ఫిల్మ్ చాంబర్ అనూహ్యంగా షాక్ ఇచ్చింది. 'ఆర్జీవీ' అనే టైటిల్‌ రిజిస్టర్ చేసేందుకు నిరాక‌రించింది. అంతేకాకుండా, ఆ టైటిల్ రిజిస్ట‌ర్ చేసుకోవాలంటే వర్మ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని సూచించింది.

కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్ అడ్రస్‌గా మార‌డం ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మకు అల‌వాటే. ర‌క్త చరిత్ర నుంచి అమ్మ రాజ్యంలో కడ‌ప బిడ్డ‌లు వ‌ర‌కు వ‌ర్మ తీసిన చిత్రాల‌పై ఎన్నో కాంట్ర‌వర్సీలు. ప్ర‌త్యేకించి `అమ్మరాజ్యంలో కడప బిడ్డలు` చిత్రంలో త‌న పాత్ర‌ను అవ‌మానించారంటూ కేఏ పాల్ కేసుల వ‌ర‌కూ వెళ్లారు. ఈ క్ర‌మంలో వ‌ర్మ వ‌ర్సెస్ పాల్ డిబేట్లు యూట్యూబ్‌లో వైర‌ల్ అయ్యాయి. అదే స‌మ‌యంలో జొన్న‌విత్తుల వ‌ర్మ బ‌యోపిక్ ప్ర‌క‌ట‌న చేశారు. అయితే, తాజాగా ఫిల్మ్ ఛాంబ‌ర్ నిర్ణ‌యంతో ప్రస్తుతానికి జొన్నవిత్తుల ప్రయత్నానికి బ్రేక్ పడింది. తాను చాలా బ్రాడ్ మైండ్ అని చెప్పుకునే వ‌ర్మ‌...పిలిచి మ‌రీ జొన్న‌విత్తుల‌కు ఎన్వోసీ ఇచ్చినా ఆశ్చ‌ర్య పోన‌వ‌స‌రం లేదేమో. త‌న బ‌యోపిక్ ఎలా తీస్తారో అన్న క్యూరియాసిటీ తో వ‌ర్మ ఇలా చేసినా పెద్ద‌గా షాక‌వ్వాల్సిందేమీ లేదు. మ‌రి, ఈ ఎన్వోసీ వ్య‌వ‌హారంపై జొన్న‌విత్తుల రియాక్ష‌న్ ఎలా ఉంటుందో వేచి చూడాలి
Tags:    

Similar News