నా దృష్టిలో వాళ్లంతా పనీపాటా లేని బ్యాచ్: రవితేజ

Update: 2022-07-19 15:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. 'క్రాక్' మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు కమిట్ అవుతున్నారు. అయితే ఇదే క్రమంలో రవితేజ పై రూమర్స్ కూడా ఓ రేంజ్ లో వచ్చాయి.

'ఖిలాడి' సినిమా సమయంలో దర్శకుడితో రవితేజ కు పొరపొచ్చాలు వచ్చాయని టాక్ వచ్చింది. దీనికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాస్ రాజా స్పీచ్ ఉంది. అయితే ఇప్పుడు 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ రిలీజ్ కు రెడీ అయిన నేపథ్యంలో.. మళ్లీ రవితేజ పై అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి.

'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా వాయిదా పడిన తర్వాత రవితేజ రీషూట్స్ కోసం అదనంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని.. అడిగినంత పారితోషికం ఇస్తే గానీ డబ్బింగ్ చెప్పడానికి రానని కరాకండిగా చెప్పేసాడని.. సినిమా విడుదల ఆలస్యం అవడానికి ఇది కూడా కారణమని.. ప్రమోషన్స్ కు కూడా అందుకే రాలేదని.. ఇలా రకరకాలుగా రూమర్స్ వచ్చాయి

ఇదే విషయంపై తాజాగా రవితేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నిర్మాత సుధాకర్ చెరుకూరితో రెమ్యూనరేషన్ విషయంలో సమస్య ఉందనే వార్తల గురించి ప్రశ్నించగా.. వారికి ఎలాంటి పని లేదు. ఇష్టమిచ్చింది వ్రాస్తారు.. పని పాట లేని బ్యాచ్. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని రవితేజ అన్నారు.

''ఇలాంటి రూమర్స్ ఫస్ట్ టైం కాదండి. చాలా సార్లు వచ్చాయి. కొంతమంది బ్యాచ్ ఉంటారు. వీళ్ళకి పనీ పాట ఉండదు. వాళ్లే అన్నీ సృష్టించి వాళ్లే ఏదేదో రాస్తుంటారు. వాటిని అస్సలు పట్టించుకోకూడదు. నేనైతే వాటిని చూసి నవ్వుకుంటా'' అని రవితేజ చెప్పారు.

''నిర్మాత సుధాకర్ నాకు చాలా మంచి ఫ్రెండ్. సుధాకర్ కు నాతోనే కాదు.. ఎవరితోనూ ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే అంత మంచి వ్యక్తి అతను. నాకు తెలిసి అతనికి శత్రువులు అంటూ లేరు. పోస్టర్ పై ఆర్టీ టీమ్ వర్క్స్ అని నా బ్యానర్ పేరు కనిపిస్తోంది. నేనే నిర్మాతగా సినిమా చేస్తున్నప్పుడు ఇంక రెమ్యునరేషన్ ప్రాబ్లమ్ అనడమేంటి?''

''నా దృష్టిలో ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసేవాళ్ళు అందరూ పనీపాట లేనివారు. వారు ఏదీ ఆలోచించరు. ఆ బ్యాచ్ ఎప్పుడూ ఉంటుంది. అలాంటివి ఉండకపోతే బాగోదు. అలాంటి వాళ్లు కూడా ఉండాలి. ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడదు. ఇంకా వస్తాయి.. వస్తూనే ఉంటాయి.. వస్తూనే ఉండాలి'' అని రవితేజ గాసిప్ రాయుళ్లకు రవితేజ కౌంటర్ ఇచ్చారు.

కాగా, 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాకి శరత్ మండవ దర్శకత్వంలో వహించారు. ఇందులో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ - రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 29న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
Tags:    

Similar News