టాలీవుడ్ పై కోలీవుడ్ బ్రదర్స్ ఫోకస్.. ఒకరు హీరోగా.. మరొకరు నిర్మాతగా..!

Update: 2021-03-22 06:30 GMT
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు స్టార్ హీరో సూర్య. 'గజిని' 'సెవెంత్ సెన్స్' 'యముడు' 'సింగం' 'సింగం 2' 'బ్రదర్స్' '24' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. గతేడాది 'ఆకాశం నీ హ‌ద్దురా' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో తాను నటించే ప్రతి సినిమాని తెలుగులో కూడా విడుదల చేస్తూ వస్తున్నాడు. అయితే తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ప్రాజెక్ట్ సెట్ అవడం లేదు.

మరోవైపు తనకన్నా వెనకొచ్చిన తమ్ముడు కార్తీ మాత్రం తెలుగులో కూడా సినిమాలు చేస్తూ మార్కెట్ విస్తరించుకుంటున్నాడు. తెలుగు కూడా బాగా నేర్చుకుని ఇక్కడి హీరోలలో భాగం అవుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు సూర్య కూడా టాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈసారి ప్రొడ్యూసర్ గా అయినా సరే తెలుగులో సినిమాలు చెయ్యాలని నిర్ణయించుకున్నారట. సూర్య '2డి ఎంటర్టైన్మెంట్స్' అనే బ్యానర్ ఏర్పాటు చేసి ఇప్పటికే పలు సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదే బ్యానర్ లో ఇప్పుడు తెలుగులోనూ కొన్ని సినిమాల్ని నిర్మించాలని డిసైడ్ అయ్యారట.

అయితే దీని కోసం టాలీవుడ్ లోని ఓ అగ్ర నిర్మాణ సంస్థతో కలవబోతున్నాడట. త్వరలో తెలుగులో నిర్మించే సినిమాలన్నీ ఆ స్టార్ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇప్పటికే సూర్య సదరు నిర్మాతలు కలిసి కొన్ని కథల్ని రెడీ చేసి పెడుతున్నారని సమాచారం. ఆ అగ్ర నిర్మాణ సంస్థ ఏదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వైట్ చేయాల్సిందే. అలానే సరైన కథ దొరికితే డైరెక్ట్ తెలుగులోనూ సినిమాలు చేయాలని చూస్తున్నాడు సూర్య. మరి భవిష్యత్ లో అన్నీ కుదిరి స్ట్రెయిట్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ని అలరిస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News