ప్రొడ్యూస‌ర్ ఓకే.. ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ రావాల్సిందే!

Update: 2022-03-23 12:30 GMT
పూజారి ప్ర‌సాదం పెట్టినా దేవుడు మాత్రం క‌నిక‌రించ‌డం లేదంటే ఇదే మ‌రి.. అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. వివ‌రాల్లోకి వెళితే... ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ `వ‌కీల్ సాబ్‌`తో మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. మూడున్న‌రేళ్ల‌ పాటు జ‌న‌సేన పార్టీ క‌ర్య‌క‌లాపాల కార‌ణంగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చిన ఆయ‌న `పింక్` రీమేక్ ఆధారంగా తెర‌కెక్కిన `వ‌కీల్ సాబ్‌` మూవీతో మ‌ళ్లీ జోరుగా సినిమాలు చేయ‌డం మొద‌లుపెట్టారు. ఈ మూవీ సూప‌ర్ హిట్ కావ‌డంతో అదే ఊపులో మ‌రో రీమేక్ ని ప‌ట్టాలెక్కించారు.

మ‌ల‌యాళ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం `భీమ్లానాయ‌క్‌`. ఇటీవ‌ల విడులైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. దీంతో త‌దుప‌రి చిత్రాల విష‌యంలో  ప‌వ‌న్ క‌ల్యాణ్‌ మ‌రింత స్పీడు పెంచారు. రీమేక్ చిత్రం `భీమ్లానాయ‌క్‌` బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డ‌మే కాకుండా ఫ్యాన్స్ కి పూన‌కాలు తెప్పించింది. ఈ మూవీ అందించిన స‌క్సెస్ ఆనందంలో మ‌రిన్ని రీమేక్ ల‌కు వ‌ప‌న్‌ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు.  
 
త‌మిళంలో స‌ముద్ర‌ఖ‌ని న‌టించి తెర‌కెక్కించిన `వినోదాయ సితం`ని త్వ‌ర‌లో సెట్స్ పైకి తీసుకురాబోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో యంగ్ హ‌రీఓ సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా న‌టించ‌బోతున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, త్రివిక్ర‌మ్‌, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ని నిర్మించ‌బోతున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రాబోతోంది.

ప్ర‌స్తుతం క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఫిక్ష‌న‌ల్ పీరియ‌డిక్ ఫిల్మ్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` చిత్రంలో న‌టిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా ప్ర‌భాస్ డైరెక్ట‌ర్ సుజీత్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ట్రిపుల్ ఆర్ ప్రొడ్యూస‌ర్ డీవీవీ దాన‌య్య ఈ భారీ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారట‌. గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ తో దాన‌య్య `కెమెరా మెన్ గంగ‌తో రాంబాబు` చిత్రాన్ని నిర్మించారు. ఇది వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో రానున్న రెండ‌వ చిత్రం. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ సుజీత్ కు దాన‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి ఇంత వ‌ర‌కు ఎలాంటి క‌న్ఫ‌ర్మేష‌న్ రాలేద‌ని తెలుస్తోంది. ఆయ‌న ఓకే అంటేనే సుజీత్ తో సినిమా లేదంటే మ‌రో డైరెక్ట‌ర్ ట్రాక్ రావ‌డం ఖాయం అని వార్త‌లు వినిపిస్తున్నాయి.

సుజీత్ వ్య‌వ‌హారం చూసిన వాళ్లంతా పూజారి ప్ర‌సాదం పెట్టినా దేవుడు వ‌రం ఇవ్వ‌డం లేదంటే ఇదే మ‌రి అని కామెంట్ చేస్తున్నార‌ట‌. సుజీత్ `సాహో` సినిమాతో పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. రెండ‌వ చిత్రాన్నే భారీ స్థాయిలో తెర‌కెక్కించి త‌న స‌త్తాని చాటుకుని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షించారు.
Tags:    

Similar News