సినిమా ఆఫర్లు లేక రోడ్ల మీద లాటరీ టికెట్లు అమ్ముతున్న నటి

Update: 2022-11-10 07:30 GMT
వెండితెర మీద వెలిగే అవకాశం చాలా తక్కువ మందికే వస్తుంది. అలా వచ్చిన వారంతా సక్సెస్ అయిపోరు. సెటిల్ అయిపోరు. కొందరికి పేరు.. గుర్తింపు వచ్చినా.. అవకాశాలు పెద్దగా రావు. అలాంటి వారి ఇబ్బంది అంతా ఇంతా కాదు.

తాజాగా ఒక నటి ఉదంతం గురించి తెలిస్తే అయ్యో.. అనుకోకుండా ఉండలేం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వ్యవహరించే ఒక నటికి అవకాశాలు రాకపోవటంతో ఇప్పుడు రోడ్ల మీద లాటరీ టికెట్లు అమ్ముతున్న వైనం షాకింగ్ గా మారింది.

కరోనాకు ముందు చిత్ర పరిశ్రమ వెలిగిపోతుందని చెప్పలేం కానీ.. ఇప్పటికంటే పరిస్థితి బాగుందని మాత్రం చెప్పొచ్చు. కరోనా కారణంగా మారిన పరిస్థితుల్లో చిన్న పాత్రలు వేసుకునే పలువురికి అవకాశాలు తగ్గిపోయాయి. అలాంటి కోవలోకే వస్తారు మలయాళ నటి మేరీ. 2016లో  యాక్షన్ హీరో బిజు మూవీతో గుర్తింపు పొందిన ఆమె జీవితం కరోనా కారణంగా ఇబ్బందుల్లో పడింది.

సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవటంతో ఆమెకు పూట గడవటం కష్టంగా మారింది. అందుకే.. ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల మీద లాటరీ టికెట్లు అమ్ముతూ బతుకు బండిని లాగుతుంది. ఉదయం ఆరున్నర గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి.. సాయంత్రం వరకు రోడ్ల మీద లాటరీ టికెట్లు అమ్మితే రూ.300 వరకు సంపాదన ఉంటుందని.. దాంతోనే ఇంటిని లాగుతున్నట్లు చెబుతున్నారు.

దాదాపు 35 సినిమాల్లో నటించిన మేరీ.. తాన సంపాదించిన సంపాదనతో కుమార్తె పెళ్లి చేయటంతో పాటు.. ఇంటిని నిర్మించుకోవాలని భావించింది. కానీ.. కరోనా కారణంగా ఆమెకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అదే సమయంలో ఆమెకు ఆఫర్లు రావటం తగ్గిపోయాయి.

దీనికి తోడు ఆమె కుమారుడి ఆరోగ్యం సరిగా లేకపోవటంతో అతడికి అవసరమైన మందుల్ని కొనటం భారంగా మారింది. దీంతో ఏదో ఒక పని చేసి కాసింత డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇప్పుడామె లాటరీ టికెట్లు అమ్ముతూ జీవనాన్ని సాగిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News