జోరు వానలో సాగిన శౌర్య పాదయాత్ర..!

Update: 2022-09-14 17:23 GMT
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హిట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్ర‌స్తుతం పలు సినిమాల‌తో బిజీగా ఉన్న శౌర్య.. హోమ్ ప్రొడక్షన్ లో రూపొందిన ''కృష్ణ వ్రింద విహారి'' చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశారు.

KVV చిత్రానికి అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో నాగశౌర్య సరసన షిర్లే సెటియా హీరోయిన్‌ గా నటించింది. సెప్టెంబరు 23న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.

ఇందులో భాగంగా సరికొత్త ప్రమోషనల్ ఐడియాతో వచ్చారు శౌర్య. రాజకీయ నాయకుల మాదిరిగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. బుధవారం (సెప్టెంబర్ 14) 'కృష్ణ వ్రింద విహారి' టీమ్ పాదయాత్ర తిరుపతి నగరంలో ప్రారంభమైంది.

తిరుపతిలో కురుస్తున్న వర్షాల మధ్య హీరో నాగశౌర్య 'పాద యాత్ర' మొదలు పెట్టారు. జోరు వానలోనూ యువ హీరో ఆగకుండా ను పాదయాత్ర చేశారు. దీనికి జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొందరు క్రేజీ ఫ్యాన్స్ వానలో తడుస్తూ కూడా శౌర్య తో సెల్ఫీలు తీసుకోడానికి ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

గురువారం (సెప్టెంబర్ 15) నెల్లూరు - ఒంగోలు నగరాల్లో నాగశౌర్య పాదయాత్ర చేయనున్నాడు. 16న విజయవాడ - గుంటూరు - ఏలూరు.. 17న భీమవరం - రాజమండ్రి.. 18న కాకినాడ - వైజాగ్‌ లలో 'కృష్ణ వ్రింద విహారి' టీమ్ పాదయాత్ర చేయనుంది.

సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి నాగశౌర్య ప్లాన్ చేసిన పాదయాత్ర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీని కోసం ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నారని తెలుస్తోంది. తెలుగు సినీ చరిత్రలో ఒక సినిమా కోసం పాదయాత్ర చేయడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. తన సినిమా కోసం ఇంత చేస్తున్న నాగశౌర్య కు ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ప్లస్ అవుతుందో లేదో చూడాలి.

కాగా, 'కృష్ణ వ్రింద విహారి' చిత్రాన్ని న్యూ ఏజ్ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ వారం రోజుల్లో మరికొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ రానున్నాయి.
Tags:    

Similar News