చిన్న సినిమాకు ముందు నుయ్యి వెన‌క గొయ్యి

Update: 2022-04-23 14:30 GMT
భారీ చిత్రాల కార‌ణంగా చిన్న చిత్రాల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా త‌యారైంది. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే చిన్న సినిమాల ప‌రిస్థితి ముందు నుయ్యి వెన‌క గొయ్యి లా మారింది. క‌రోనా కార‌ణంగా దాదాపు రెండేళ్ల పాటు థియేట‌ర్లు అర‌కొర‌గానే ఓపెన్ అయ్యాయి. అందులోనూ 50 శాతం ఆక్యుపెన్సీ అంటూ నిబంధ‌న‌లు వుండ‌టంతో చిన్న సినిమాలు చాలా ఇబ్బందులు ప‌డ్డాయి. దీని కార‌ణంగా చిన్న చిత్రాలు విడుద‌ల‌కు నోచుకోలేదు. ఇక థ‌ర్డ్ వేవ్‌, ఒమిక్రాన్ ల ప్ర‌కంప‌ణ‌లు స‌ద్దుమ‌నిగాక థియేట‌ర్లు పూర్తి స్థాయిలో రీఓపెన్ అయ్యాయి.

గ‌త రెండేళ్లుగా రిలీజ్ కు నోచుకోని చిత్రాల‌న్నీ ఊప‌రి పీల్చుకున్నాయి. ఇక బ్యాక్ టు బ్యాక్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డ‌మే త‌రువాయి అనుకున్నాయి. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు కొన్ని న‌బంధ‌ల‌తో రీఓపెన్ కావ‌డంతో వ‌రుస‌గా భారీ చిత్రాల రిలీజ్ డేట్ లు ప్ర‌క‌టించడం మొద‌లైంది. పాన్ ఇండియా మూవీస్ తో పాటు భారీ క్రేజీ చిత్రాలు కూడా వ‌రుస‌గా రిలీజ్ డేట్ ల‌ని ప్ర‌క‌టించ‌డంతో మ‌ళ్లీ చిన్న చిత్రాల‌కు తీవ్ర నిరాశే ఎదురైంది.

భారీ చిత్రాలు, పాన్ ఇండియా చిత్రాల మ‌ధ్య ప‌డి న‌ల‌గ‌డం ఇష్టం లేక‌పోవ‌డం.. పైగా చిన్న చిత్రాల‌కు థియేట‌ర్లు ల‌భించ‌క‌పోవ‌డంతో చాలా వ‌ర‌కు చిన్న సినిమాలు ల్యాబ్ కే ప‌రిమిత‌మైపోయాయి. దీంతో వ‌రుస‌గా బిగ్ స్టార్స్ న‌టించిన చిత్రాలు, పాన్ ఇండియా మూవీస్ వ‌రుస‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డం మొద‌లు పెట్టాయి. ఇందులో కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిల‌వ‌గా మ‌రి కొన్ని డిజాస్ట‌ర్ గా నిలిచి భారీ న‌ష్టాల‌ని అందించాయి. గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌లైన అఖండ‌, పుష్ప‌, శ్యామ్ సింగ రాయ్ సూప‌ర్ హిట్ లుగా నిలిచాయి.

ఇక ఆ త‌రువాత ఈ ఏడాది విడుద‌లైన బంగార్రాజు హిట్ అనిపించుకోగా, రాధేశ్యామ్ నిరుత్సాహ ప‌రిచింది. ఆ త‌రువాత‌ విడుద‌లైన ట్రిపుల్ ఆర్‌, కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేస్తున్నాయి. మ‌ధ్య‌లో విడుద‌లైన 'గ‌ని' దారుణంగా నిరుత్సాహ ప‌రిచి భారీ న‌ష్టాల‌ని అందించింది. రీసెంట్ గా విడుద‌లైన ట్రిపుల్ ఆర్‌, కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద దేశ వ్యాప్తంగా క‌లెక్ష‌న్ ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. దీంతో చిన్న సినిమాలు రిలీజ్ డేట్ లు ప్ర‌క‌టించినా ఈ రెండు చిత్రాల ధాటికి త‌ట్టుకోలేక ప‌క్క‌కు త‌ప్పుకుంటున్నాయి.

ఇటీవ‌ల రెండు చిత్రాలు ఏప్రిల్ లో రావ‌డానికి ట్రై చేసినా 'కేజీఎఫ్ 2' ప్ర‌భంజ‌నం.. ఏప్రిల్ 29న వ‌స్తున్న 'ఆచార్య‌'కు భ‌య‌ప‌డి రిలీజ్ డేట్ ని మ‌రోసారి మార్చుకోవాల్సి వ‌చ్చింది. ఇలా ప‌లు ద‌ఫాలుగా రిలీజ్ డేట్ లు మార్చుకున్న చిత్రాలు విశ్వ‌క్ సేన్ న‌టించిన 'అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం'.. నాగ‌శౌర్య న‌టించిన 'కృష్ణ వ్రింద విహారి'. ఇక ఈ చిత్రాల‌తో పాటు దాదాపు రెండు ద‌శాబ్దాల విరామం త‌రువాత యాంక‌ర్ సుమ 'జ‌య‌మ్మ పంచాయితీ' చిత్రంతో రాబోతోంది. ఈ మూవీ కూడా రిలీజ్ స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది.

పోనీ కేజీఎఫ్ 2 ప్ర‌భావంతో రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకుని 'ఆచార్య‌' త‌రువాత థియేట‌ర్ల‌లో సంద‌డి చేయాల‌నుకున్నా 'స‌ర్కారు వారి పాట‌', ఎఫ్ 3 పోటీకి రెడీ అవుతున్నాయి. దీంతో మే చివ‌ర‌లో కానీ చిన్న చిత్రాల‌కు థియేట‌ర్లు ల‌భించ‌ని ప‌రిస్థితి. ఈ ప‌రిస్థితి చిన్న సినిమాల‌కు ఎప్పుడు మారేనో అని స్మాల్ మూవీస్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News