`మా` ర‌ణ రంగంలోకి రఘుబాబు, బాబూ మోహ‌న్

Update: 2021-09-19 03:30 GMT
`మా` అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఎప్పుడూ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ర‌ణ‌రంగాన్ని.. రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్య సాగే విమ‌ర్శ‌, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌ని గుర్తు చేస్తుంటాయి. అంతా హాట్‌గా సాగే `మా` ఎల‌క్ష‌న్స్ అంటే అంతా ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఎప్ప‌టిలాగే ఈ సారి కూడా `మా` ఎన్నిక‌ల స‌మ‌రం గమొద‌లైంది. అయితే గ‌త ఎన్నిక‌ల‌ని మించి ఈ సారి మ‌రింత వాడీ వేడీగా సాగుతోంది. కార‌ణం `మా` ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ పోటీకి దిగ‌డ‌మే.

ఆయ‌న‌తో పాటు హీరో మంచు విష్ణు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సీవీఎల్ న‌రసింహారావు కూడా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్నారు. ఇప్ప‌టికే త‌న‌దైన పంథాలో అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించి ప్ర‌కాష్‌రాజ్ ప్ర‌చారం కూడా మొద‌లు పెట్టేశారు. ఇదిలా వుంటే న‌రేష్ మ‌ధ్య‌లో సెటైర్లు వేయ‌డం.. దానికి ప్ర‌కాష్‌రాజ్ గ‌ట్టి కౌంట‌ర్ ఇవ్వ‌డం తెలిసిందే. ఇదిలా జ‌రుగుతుంటే బండ్ల గ‌ణేష్ కూడా చేరి ర‌చ్చకు దిగారు.

ప్ర‌కాష్‌రాజ్ ప్యానెల్ ని ప్ర‌క‌టించి ప్ర‌చారం జోరు పెంచ‌డంతో మంచు విష్ణు కూడా త‌న‌దైన చ‌తుర‌త‌ని ప్ర‌ద‌ర్శిస్తూ అభ్య‌ర్థుల్ని ఒక్కొక్క‌రిగా రంగంలోకి దించేస్తున్నారు. త‌న ప్యానెల్ నుంచి ఇద్ద‌రు క‌మెడియ‌న్ ‌ల‌ని రంగంలోకి దించేశారు. ఒక‌రు క‌మెడియ‌న్ ర‌ఘుబాబు. మ‌రొక‌రు బాబూ మోహ‌న్‌. ఈ ఇద్ద‌రిలో ర‌ఘుబాబు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా పోటీప‌డుతున్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబూ మోహ‌న్ రంగంలోకి దిగుతున్నారు. ఇదే ఊపులో హీరో మంచు విష్ణు త‌న ప్యానెల్‌తో పాటు త‌న అజెండాను కూడా త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌బోతున్నారు.

`మా` అధ్య‌క్ష పీఠానికి ముగ్గురు పోటీప‌డుతుండ‌టంతో ఈ ముగ్గురిలో గెలుపెవ‌రిది అనే ఉత్కంఠ రోజు రోజుకీ ఫిలిం స‌ర్కిల్స్‌లో పెరిగిపోతోంది. ప్ర‌కాష్‌రాజ్ ప‌ర భాషా న‌టుడు అని కొన్ని రోజుల‌గా విమ‌ర్శ‌లు చేసిన వాళ్లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కార‌ణం ఆయ‌న సంధిస్తున్న ప్ర‌శ్న‌లే. ఇప్ప‌టికే ఆయ‌న త‌న‌దైన మార్కు ప్ర‌సంగాల‌తో ఆక‌ట్టుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. మంచు విష్ణు కూడా త్వ‌ర‌లో జోరు పెంచ‌బోతుండ‌టంతో ఈ ఇద్ద‌రిలో అధ్య‌క్ష పీఠం వ‌రించేది ఎవ‌రిని అనే చ‌ర్చ మొద‌లైంది. అక్టోబ‌ర్ 10న `మా` ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చ‌క చ‌కా జ‌రిగిపోతున్నాయి.



Tags:    

Similar News