మ‌హ‌మ్మారీతో బాగా మింగిలైన టాలీవుడ్

Update: 2022-02-18 16:30 GMT
ఎవ‌రికైనా ఏదైనా క‌ష్టం క‌లిగితే అయ్యో రామా! అంటూ నిరాశ‌లో కూరుకుపోతారు. కానీ మ‌న స్టార్ హీరోలు మొద‌లుకుని చిన్నా చిత‌కా హీరోల వ‌ర‌కూ ఎవ‌రూ ఎలాంటి క‌ష్టానికి లొంగ‌డం లేదు. ముఖ్యంగా గ‌డిచిన రెండేళ్లుగా మ‌హ‌మ్మారీ క‌రోనా వెంటాడుతున్నా కానీ ఎవ‌రూ త‌గ్గేదేలే అంటూ షూటింగుల‌కు వెన‌కాడ‌లేదు. ముఖ్యంగా డార్లింగ్ ప్ర‌భాస్ లాంటి హీరో అయితే అస‌లు క‌రోనాని ఖాతరే చేయ‌లేదు.

 ఒక‌వైపు ప్ర‌పంచం గ‌జ‌గ‌జ ఒణుకుతుంటే రాధేశ్యామ్ కోసం.. అత‌డు యూరోపియ‌న్ దేశాల‌కు వెళ్లొచ్చాడు. ఇంత మ‌హ‌మ్మారీని లెక్క చేయ‌క ఆదిపురుష్ 3డి- స‌లార్- నాగ్ అశ్విన్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు.  ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ షూటింగ్ లో ఆయనతో పాటు దీపికా పదుకొణె- అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొంటున్నారు.

గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు తగ్గడం ప్రారంభించినా దేనికీ మ‌న టాలీవుడ్ హీరోలు భ‌య‌ప‌డ‌డం లేదు. ఇప్ప‌టికి మహమ్మారి మూడవ తరంగం ముగింపు దశకు చేరుకుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలించాయి. ఇదిలా ఉంటే వాయిదా పడిన చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. నిర్మాణంలో ఉన్న సినిమాలు కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలందరూ తమ తమ సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ప్ర‌భాస్ - చిరంజీవి- బాల‌కృష్ణ‌- చ‌ర‌ణ్- తార‌క్- నాగార్జున - వెంక‌టేష్ ఇలా ఒక‌రేమిటి టాలీవుడ్ హీరోలంతా సినిమాల‌తో బిజీ బిజీ.

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన గాడ్ ఫాదర్‌- భోళా శంకర్‌ చిత్రాల నిర్మాణ పనులు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. ఈ సినిమాలే కాకుండా ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమైన ఆచార్య ప్ర‌మోష‌న్స్ కి షెడ్యూల్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన రాబోయే చిత్రం RC 15 షూటింగ్ లో రాజమండ్రిలో ఉన్నారు. ప్రస్తుతం మేకర్స్ నగరంలో 15 రోజుల కీలక షెడ్యూల్ ని షూట్ చేస్తున్నారు.

ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ధమాకా షూటింగ్‌లో  బిజీగా ఉన్నాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పనులు హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో జరుగుతున్నాయి. ఈ సినిమాతో పాటు రవితేజ తన మరో సినిమా రామారావు ఆన్ డ్యూటీలో కూడా నటిస్తున్నాడు.

కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రాన్ని రాజేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తోంది. తమిళ హీరో ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం సర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ధనుష్ కి క‌రోనా నిర్ధారణ కావడంతో గత నెలలో సర్ షూటింగ్ కొన్ని వారాల పాటు ఆగిపోయింది. అతను కోలుకున్న తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. సూక్ష్మంలోనూ మోక్షం ప్లాన్ చేయ‌డంలో మ‌న స్టార్ల త‌ర్వాతే.
Tags:    

Similar News