దర్శకేంద్రుడికి ఒట్టేసిన కమెడియన్

Update: 2017-05-24 05:43 GMT
రీసెంట్ గా రిలీజ్ అయిన కేశవ మూవీ ఎంతటి సీరియస్ జోన్ లో సాగుతుందో తెలిసిన విషయమే. కూల్ గా పగ తీర్చుకునే రివెంజ్ డ్రామాలో నిఖిల్ ఒదిగిపోతే.. అదే సినిమాలో బోలెడన్ని నవ్వులు పూయించాడు వెన్నెల కిషోర్. కాలేజ్ స్టూడెంట్ గా కిషోర్ చేసిన పాత్ర అందరికీ తెగ నచ్చేస్తోంది కూడా.

ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన అమీ తుమీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కిషోర్. అవసరాల శ్రీనివాస్.. అడివి శేష్ ఈ మూవీలో హీరోలు కాగా.. వారి ప్రేమలకు బలయిపోయే పాత్రలో నటించానని చెప్పాడు వెన్నెల కిషోర్. 'అమీ తుమీలో నా పాత్ర నెగిటివ్ గా కూడా అనిపిస్తుంది. మొత్తం మీద నా రోల్ చాలా వెరైటీగా ఉంటుంది. పేరు కూడా విచిత్రంగా అనిపిస్తుంది. అయితే.. నేను గతంలో హీరోగా ప్రయత్నించిన మాట నిజమే కానీ.. ఇప్పుడు అలాంటివేమీ చేయదలచుకోలేదు. నాకు డ్యాన్స్ లు.. ఫైటింగ్స్ రావు. అసలు ఇంకెప్పుడూ హీరోగా ప్రయత్నించను అని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు నాతో ఒట్టు వేయించుకున్నారు' అని చెప్పాడు వెన్నెల కిషోర్.

ఈయన కూడా ఓ దర్శకుడు కావడంతో సహజంగా కొన్ని మార్పు చేర్పులు చెబుతుంటాడట. కానీ ఇంద్రగంటితో మాత్రం అలాంటి అవసరం ఉండదని.. నెల రోజులకు ముందే స్క్రిప్ట్ చేతిలో పెట్టేస్తారని చెప్పాడు వెన్నెల కిషోర్. స్క్రిప్ట్ గురించి పూర్తిగా తెలిస్తే పని చేయడం ఎంత తేలిక అవుతుందో.. ఇంద్రగంటి మోహన్ కృష్ణతో పని చేశాకే తెలిసిందని అన్నాడు ఈ కమెడియన్.
Tags:    

Similar News