తారక్ జపాన్ నుండి తిరిగొచ్చిన తర్వాతే క్లారిటీ వస్తుందా..?

Update: 2022-10-20 05:34 GMT
ఈ ఏడాది RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ సినిమా వచ్చి ఏడు నెలలు కావొస్తున్నా ఇంతవరకూ మరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోయారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో NTR30 ప్రాజెక్ట్ అని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది.

ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న తర్వాత రాబోయే సినిమా కావడంతో ఈ మూవీపై అందరిలో మంచి అంచనాలున్నాయి. పైగా కొరటాలతో గతంలో చేసిన 'జనతా గ్యారేజ్' చిత్రం మంచి విజయం సాధించింది. అందుకే ఈసారి నేషనల్ వైడ్ రిపేర్లు చేస్తారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. దీనికి తగ్గట్టుగానే 'ఫ్యూరీ ఆఫ్ ఎన్టీఆర్30' ప్రీ లుక్ మోషన్ పోస్టర్ మాంచి హై ఇచ్చింది. అయితే రోజులు గడుస్తున్నా ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు కావడం లేదు.

అక్టోబర్ లోనే సెట్స్ మీదకు తీసుకొస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ.. మేకర్స్ సైడ్ నుంచి క్లారిటీ రాలేదు. స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని.. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడానికి సమయం పడుతుందనే టాక్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ 'ఆర్.ఆర్.ఆర్' మూవీ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లడంతో NTR30 షూటింగ్ ఈ నెలలో స్టార్ట్ చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉంటే కథా చర్చలు - స్క్రిప్ట్ వర్క్ మినహా ఇంకా ఎన్టీఆర్ సినిమా కోసం హీరోయిన్ ను కూడా ఖరారు చేయలేదనే వార్తలు వస్తున్నాయి. టెక్నికల్ టీమ్ ని ఎంపిక చేసిన తర్వాత ముందుగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ని కథానాయికగా ఫైనలైజ్ చేసారు. అయితే ప్రెగ్నెన్సీ కారణంగా ఆలియా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమాలో నటించే హీరోయిన్లు అంటూ అనేకమంది అందాల భామల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటికీ ఎవరినీ ఎంపిక చేయలేదని తెలుస్తోంది.

ఇటీవల కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి తో మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. అలానే సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కోసం ప్రయత్నిస్తున్నారని కూడా అన్నారు. ఇదే క్రమంలో మరికొందరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే తారక్ హీరోయిన్ ఎంపిక విషయాన్ని పెండింగ్‌ లో ఉంచారట. ప్రస్తుతం RRR సినిమా ప్రమోషన్స్ కోసం టోక్యోలో ఉన్న ఎన్టీఆర్.. జపాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత కథానాయిక పై నిర్ణయం తీసుకోవచ్చని టాక్ నడుస్తోంది.

అంతేకాదు NTR30 చిత్రాన్ని నవంబర్ లో సెట్స్ పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అనుకుంటున్నారు. త్వరలోనే మేకర్స్ దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఏదేమైనా 'ఆచార్య' డిజాస్టర్ కు కొరటాల శివే బాధ్యుడనే విధంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. దర్శకుడు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీని తర్వాత 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ భారీ సినిమా చేయనున్నారు.

NTR30 చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ (నందమూరి కళ్యాణ్ రామ్) సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ - కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ.. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ విభాగాలు నిర్వహిస్తారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News