జైలు జీవితంపై జానీ మాస్టర్ సంచలన కామెంట్స్!

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ పై కొన్ని రోజుల క్రితం అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ అత్యాచారం కేసు పెట్టిన విషయం తెలిసిందే

Update: 2024-10-26 10:11 GMT

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ పై కొన్ని రోజుల క్రితం అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ అత్యాచారం కేసు పెట్టిన విషయం తెలిసిందే. తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, అనేక విధాలుగా వేధించారని హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ గా ఉన్న టైమ్ లో కూడా తనను లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు.. పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న జానీ మాస్టర్ లో గోవాలో అదుపులోకి తీసుకున్నారు.

అక్కడ కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్ తీసుకుని.. హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఇక్కడ కోర్టు ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే 36 రోజుల పాటు జైలులో ఉన్న ఆయన.. పలుమార్లు బెయిల్ కావాలని హైకోర్టును కోరారు. అలా జానీకి శుక్రవారం బెయిల్ లభించిన విషయం తెలిసిందే. పలు షరతులను విధించిన న్యాయస్థానం.. బాధితురాలి జీవితంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో శనివారం జైలు నుంచి బయటకు వచ్చిన జానీ.. కారులో తన ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో రెడ్ కలర్ టవల్ మెడలో వేసుకుని వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇంటికి చేరుకున్నాక జానీ మాస్టర్ కొందరు సన్నిహితులతో మీట్ అయినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఒక డైరెక్టర్ తోపాటు కొందరు కొరియోగ్రాఫర్లతో కాసేపు సమావేశమయ్యారని టాక్ వినిపిస్తోంది. ఆ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలు షేర్ చేసుకున్నారని సమాచారం

తాను ఇంటికి వచ్చినా.. ఇంకా జైలులోనే ఉన్నట్లు అనిపిస్తోందని జానీ మాస్టర్ చెప్పినట్లు తెలుస్తోంది. అక్కడి ఫుడ్ అస్సలు తినలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారట. మనిషి అనేవాడు జీవితంలో ఎప్పుడూ జైలుకు పోకూడదని అన్నారని సమాచారం. అందులోకి వెళ్తే నరకంగా ఉంటుందని చెప్పారని టాక్ వినిపిస్తోంది. అసలు ఈ విషయంలో ఏం జరిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదని బాధపడినట్లు వినికిడి. తాను ఒక రెండు రోజుల వరకు ఎవరితో మాట్లాడనని చెప్పారట.

ఇప్పట్లో మీడియా ముందుకు రానని కూడా జానీ మాస్టర్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ కొద్ది రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానని చెప్పారట. త్వరలో అన్ని విషయాలు క్లియర్ గా బయటపెడతానని జానీ చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. తాను నార్మల్ స్థితికి రావాలంటే కాస్త టైమ్ పడుతుందని, ఆ తర్వాత అందరితో మాట్లాడతానని తనను కలిసిన కొరియోగ్రాఫర్లకు చెప్పినట్లు వినికిడి. మరి జానీ మాస్టర్ మీడియా ముందుకు ఎప్పుడు వస్తారో? ఏం మాట్లాడతారో వేచి చూడాలి.

Tags:    

Similar News