23 ఏళ్ల తర్వాత మహేష్ మళ్లీ కుమ్మేశాడు

సూపర్ స్టార్‌ మహేష్ బాబు ఈ ఏడాది ఆరంభంలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

Update: 2024-08-10 08:43 GMT

సూపర్ స్టార్‌ మహేష్ బాబు ఈ ఏడాది ఆరంభంలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. ఈ సమయంలోనే మహేష్ బాబు తదుపరి సినిమా రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఆ సినిమా రావడం కు కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. ఈ గ్యాప్‌ లో మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఫుల్‌ ఫ్యాక్ వినోదాన్ని, కిక్ ను ఇచ్చే విధంగా మురారి సినిమా రీ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మురారి మేనియా కొనసాగుతోంది.

మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన మురారి సినిమా బిగ్గెస్ట్‌ హిట్‌ గా నిలిచింది. రీ రిలీజ్ లో ఈ స్థాయి విజయం మరే సినిమా దక్కించుకోలేదు అనే స్థాయిలో మురారి సినిమా భారీ స్పందన దక్కించుకుంది. సాధారణంగా రీ రిలీజ్ అంటే థియేటర్లలో ఎక్కువగా అబ్బాయిలు కనిపిస్తూ ఉంటారు. కానీ మురారి సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. 23 ఏళ్ల తర్వాత కూడా మురారి అదే జోరు కనబర్చాడు.

కెరీర్‌ ఆరంభంలో మహేష్ బాబు చేసిన మురారి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు టాలీవుడ్‌ లో ఒక ట్రెండ్‌ సెట్టర్ సినిమాగా నిలిచిన విషయం తెల్సిందే. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయి. సినిమాను ప్రేక్షకులు చూసే తీరు మారింది. అంతే కాకుండా ఇప్పుడు ట్రెండ్‌ కూడా పూర్తిగా మారి పోయింది. అయినా కూడా మహేష్‌ బాబు మురారి సినిమా కు రీ రిలీజ్ లోనూ మంచి స్పందన దక్కింది. కేవలం మహేష్ బాబు ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా మొత్తం తెలుగు సినీ ప్రేమికులు మురారి సినిమాను అభిమానిస్తూ థియేటర్లలో తెగ సందడి చేస్తున్నారు.

మహేష్‌ బాబు ఈ ఏడాది గుంటూరు కారంతో నిరాశ పరిచాడు అని ఫ్యాన్స్‌ భావిస్తున్న సమయంలో మురారితో వచ్చి 2024 తనకు హిట్‌ ఏడాది అంటూ నిరూపించుకున్నాడు. తన సినిమాలకు మరే సినిమాలు సాటి రావు అంటూ మహేష్ బాబు మురారి తో మరోసారి నిరూపించాడు. 23 ఏళ్ల తర్వాత కూడా మహేష్ బాబు మురారి సినిమా ఈ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోవడం సినీ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గత రెండేళ్లుగా వరుసగా రీ రిలీజ్ లు అవుతున్నాయి. కానీ ఈ స్థాయి స్పందన అమ్మాయిల నుంచి వచ్చిన దాఖలాలు మాత్రం లేవు అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

సాధారణంగా రీ రిలీజ్ అంటే ఒక్క షో అది కూడా ఎంపిక చేసిన థియేటర్‌ లలో మాత్రమే వేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ కొత్త సినిమాల స్థాయిలో మార్నింగ్ షో నుంచి అన్ని ఆటలు వేయడంతో పాటు ఈ వీకెండ్‌ మొత్తం కూడా మురారిని థియేటర్‌ లో ఆడించబోతున్నారు. ఈ మూడు రోజుల పాటు కచ్చితంగా భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు. రీ రిలీజ్ మొదటి రోజు వసూళ్లు ఎన్ని అనే విషయమై క్లారిటీ రావాల్సింది. మురారి తోనే ఈ స్థాయిలో సందడి చేస్తే మహేష్ బాబు, రాజమౌళి సినిమా వస్తే ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News