క్షమాపణలు చెప్పిన కింగ్ నాగార్జున!

వివరాల్లోకి వెళ్తే.. నాగార్జున ప్రస్తుతం తమిళ హీరో ధనుష్ తో కలిసి 'కుబేర' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-06-24 03:54 GMT

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగ్ తన స్టాఫ్ తో కలిసి ఎయిర్ పోర్ట్ నుంచి వస్తుండగా.. ఆయన సహాయక సిబ్బందిలో ఒకరు అక్కడ ఒక పెద్దాయనతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో విచారం వ్యక్తం చేస్తూ, నాగార్జున క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని పోస్ట్ పెట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. నాగార్జున ప్రస్తుతం తమిళ హీరో ధనుష్ తో కలిసి 'కుబేర' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ నిమిత్తం ధనుష్ తో కలిసి నాగ్ ముంబై వెళ్ళారు. ఆదివారం ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు, అక్కడ పని చేస్తున్న ఓ వ్యక్తి ఆయన్ను కలిసే ప్రయత్నం చేశారు. అప్పుడు పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకుని దూరంగా నెట్టివేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు ధనుష్ తన కొడుకుతో కలిసి వెనుక నడుచుకుంటూ రావడాన్ని గమనించవచ్చు.

ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో, నెటిజన్లు నాగార్జునను ట్రోల్ చేస్తున్నారు. ఆయన భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం లేదని, ఇతరుల పట్ల కొంత సానుభూతి చూపించండి అంటూ పోస్టులు పెట్టారు. ఇది నాగ్ దృష్టికి రావడంతో 'ఎక్స్' వేదికగా సారీ చెప్పారు. "ఇది నా దృష్టికి వచ్చింది... ఇలా జరిగి ఉండకూడదు. నేను ఆ పెద్దమనిషికి క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో అలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాను" అని పోస్టులో పేర్కొన్నారు.

నిజానికి ఈ సంఘటన జరిగిన సమయంలో, ఆ వ్యక్తిని పక్కకి లాగిన విషయం నాగార్జున దృష్టిలో పడినట్లుగా వీడియోలో కనిపించలేదు. అభిమానుల అరుపులు వినిపిస్తున్నప్పటికీ ఆయన వెనక్కి తిరిగి చూసినట్లుగా లేదు. కానీ వెనక వస్తున్న ధనుష్ చూసినట్లు కనిపిస్తోంది. ఏదైతేనేం ఈ వీడియో తన దృష్టికి వచ్చిన వెంటనే నాగ్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. అంత పెద్దహీరో అయ్యుండి తన సిబ్బంది వల్ల జరిగిన తప్పుకి పబ్లిక్ గా సారీ చెప్పడం గొప్ప విషయమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

తమ ఫేవరెట్ హీరో హీరోయిన్లను చూడాలని, ఒక్కసారైనా వారితో మాట్లాడాలని, కుదిరితే ఒక ఫోటో దిగాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు తారస పడితే, సెక్యూరిటీని సైతం లెక్క చేయకుండా దూసుకుపోతుంటారు. అప్పుడప్పుడు భద్రతా సిబ్బంది చేతిలో ఫ్యాన్స్ కు భంగపాటు తప్పదు. ఇటీవలి కాలంలో ఎయిర్ పోర్టుల వద్ద ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సెలబ్రిటీలకు ఇబ్బంది కలగకూడదని ఎలాగైతే తమ సిబ్బంది జాగ్రత్త వహిస్తారో.. అలానే అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తించకుండా, వారితో సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

ఇక కింగ్ నాగార్జున సినిమాల విషయానికొస్తే, ఈ ఏడాది ప్రారంభంలో 'నా సామి రంగా' తో సూపర్ హిట్ సాధించారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ తో కలిసి 'కుబేర' మూవీ చేస్తున్నారు. అలానే ఎస్. ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ లో నాగ్ భాగం కానున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో పాటుగా ఓ తమిళ దర్శకుడికి పచ్చజెండా ఊపినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Tags:    

Similar News