నాగచైతన్య 'X' అకౌంట్ హ్యాక్ అయిందా?

''నేను 2013లో 50 డాలర్లతో 100 బిట్ కాయిన్లను కొనుగోలు చేసాను. వాటి విలువ ఇప్పుడు 6 మిలియన్ డాలర్లుగా ఉంది.

Update: 2024-10-09 10:49 GMT

టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ నాగచైతన్యకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్స్ వంటి ఫ్లాట్ ఫార్మ్స్ లో ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య మిలియన్లలో ఉంది. పెద్దగా యాక్టీవ్ గా ఉండరు కానీ, అప్పుడప్పుడు తన సినిమా సంగతులను పంచుకుంటూ ఉంటారు. అయితే గత కొద్దిరోజులుగా అనుకోని కారణాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్న అక్కినేని వారసుడు.. తాజాగా 'ఎక్స్'లో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

''నేను 2013లో 50 డాలర్లతో 100 బిట్ కాయిన్లను కొనుగోలు చేసాను. వాటి విలువ ఇప్పుడు 6 మిలియన్ డాలర్లుగా ఉంది. వీటిని బహుమతిగా ఇవ్వడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇవ్వాలా వద్దా ఓటు వేయండి'' అంటూ నాగచైతన్య అకౌంట్ నుంచి ఓ పోస్ట్ చేయబడింది. దీంతో బిట్ కాయిన్లు తమకు గిఫ్ట్ గా ఇవ్వాలంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెట్టారు. మరికొందరు మాత్రం చైతన్య ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయ్యుండొచ్చని కామెంట్స్ పెట్టారు.

సాధారణంగా ఇలాంటి బిట్ కాయిన్ వ్యవహారాల గురించి ఎక్కువగా హ్యాకర్లు మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటారు. సెలబ్రిటీల ఖాతాలను హ్యాక్ చేసిన తర్వాత ఈ విధంగా పోస్టులు పెడుతుంటారు. కాబట్టి ఇప్పుడు నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ ను కూడా ఎవరో హ్యాకర్స్ హ్యాక్ చేసి ఉంటారనే అనుమానాలు అభిమానులు వ్యక్తం చేసారు. ఇది చైతూ వరకూ చేరిందో ఏమో, వెంటనే ఈ ట్వీట్ ను డిలీట్ చేసారు. అయితే అప్పటికే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

నాగచైతన్య 2010 నుంచి ట్విట్టర్ 'X' అకౌంట్ ఉపయోగిస్తున్నారు. 2.6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉండగా.. 126 మందిని మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారు. అలానే ఇంస్టాగ్రామ్ లో 7.4 మిలియన్లు, ఫేస్ బుక్ లో 3.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. చైతూ చివరగా ఎక్స్ లో తెలంగాణ మంత్రి కొండా సురేఖపై వేసిన పరువునష్టం దావాకి సంబంధించిన పోస్ట్ పెట్టారు. తన విడాకుల గురించి, ఫ్యామిలీ గురించి సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు.

ఇక సినిమాల విషయానికొస్తే. నాగచైతన్య ప్రస్తుతం 'తండేల్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో చై డీగ్లామర్ లుక్ లో తండేల్ రాజు అనే మాస్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రమోషనల్ మెటీరియల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చైతూ బర్త్ డే స్పెషల్ గా వచ్చే నెలాఖరున ఏదైనా అప్డేట్ వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News