ప్రమోషన్స్‌కు హీరో దూరంగా ఉంటే కష్టమేనా?

టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ నటించిన రెండు సినిమాలు వారం గ్యాప్ లో రిలీజ్ కు రెడీ అయ్యాయి

Update: 2024-07-23 14:38 GMT

టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ నటించిన రెండు సినిమాలు వారం గ్యాప్ లో రిలీజ్ కు రెడీ అయ్యాయి. 'పురుషోత్తముడు' మూవీ ఈ నెల 26న థియేటర్లలోకి వస్తుంటే.. ఆగస్టు 2వ తారీఖున 'తిరగబడర సామీ' సినిమా విడుదల కానుంది. మాములుగా కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తే, సినిమాలకు బజ్ తీసుకురావడానికి హీరో అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రాజ్ తరుణ్ మాత్రం ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం ఈ మధ్య అతని చుట్టూ అనుకోని వివాదాలు చెలరేగడమే అని అర్థమవుతోంది.

రాజ్ తరుణ్ తనతో కొన్నేళ్లు డేటింగ్ చేసి ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ లావణ్య అనే యువతి చీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో సహజీవనం చేస్తుండటమే దీనికి కారణమని ఆరోపించింది. ఈ ఇష్యూపై రాజ్ తరుణ్ ఇప్పటికే స్పందించారు. చట్టబద్ధంగానే ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటానని చెప్పారు. అయితే గత కొన్ని రోజులుగా ఇదే హాట్ టాపిక్ గా నడుస్తుండటంతో రాజ్ తరుణ్ మీడియాకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోని తాజాగా నిర్వహించిన 'పురుషోత్తముడు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా అటెండ్ అవ్వలేదు.

రామ్ భీమన దర్శకత్వంలో రాజ్ తరుణ్, హాసిని సుధీర్ జంటగా నటించిన చిత్రం 'పురుషోత్తముడు'. మరో మూడు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మంగళవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు. దీనికి హీరోయిన్ హాసినితో సహా ప్రకాశ్‌ రాజ్‌, బ్రహ్మనందం, రాజారవీంద్ర, ప్రవీణ్, సమీర్ లాంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. కానీ రాజ్ తరుణ్ మాత్రం రాలేదు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ రాజ్ తరుణ్ కొన్ని పరిస్థితుల్లో ఈ ఈవెంట్ కు రాలేకపోతున్నారని, ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా సహాయ సహకారాలు కావాలని మీడియాకి విజ్ఞప్తి చేసారు.

'పురుషోత్తముడు' సినిమాతో పాటుగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయన్' చిత్రం థియేటర్లలోకి వస్తోంది. అలానే రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటించిన 'ఆపరేషన్ రావణ్' మూవీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికైతే ధనుష్ సినిమాకే బజ్ కనిపిస్తోంది. హడావిడిగా మొన్నటికి మొన్న డేట్ అనౌన్స్ చేయడంతో రాజ్ తరుణ్ సినిమా విడుదల అవుతుందనే సంగతి పెద్దగా ఎవరికీ తెలియడం లేదు. ఇలాంటి టైంలో హీరో కనుక దూకుడుగా ప్రచారం చేస్తే, ఆడియన్స్ దృష్టి కాస్త ఇటు మళ్లేది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. దీంతో మిగతా తారాగణం అంతా ఆ బాధ్యత తీసుకున్నారు. టాక్ బాగుంటేనే రాజ్ తరుణ్ వివాదాన్ని మర్చిపోయి జనాలు ఈ సినిమాని చూసే అవకాశం ఉంది.

ఇక 'తిరగబడర సామీ' సినిమా విషయానికొస్తే.. దీంట్లో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా నటించారు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన తర్వాతే లావణ్య ఎంట్రీ ఇచ్చింది. దాంతో అందరూ సైలెంట్ అయ్యారు. మళ్ళీ హైప్ తీసుకురావడానికి ప్రచారం మొదలు పెట్టాల్సిన అవసరముంది. ఆగస్టు ఫస్ట్ వీక్ లో అల్లు శిరీష్ 'బడ్డీ', అశ్విన్ బాబు 'శివం భజే' సినిమాతో పాటుగా.. ఉషా ప‌రిణ‌యం, అలనాటి రామచంద్రుడు లాంటి మరో రెండు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వాటితో పోటీగా నిలబడటానికి రాజ్ తరుణ్ ప్రమోషన్స్ లో పాల్గొంటారేమో చూడాలి.

Tags:    

Similar News