'పుష్ప 2' దెబ్బకు రష్మిక బాలీవుడ్ మూవీ అవుట్?

ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'పుష్ప 2' గురించే చర్చలు జరుగుతున్నాయి.

Update: 2024-10-24 04:08 GMT

ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'పుష్ప 2' గురించే చర్చలు జరుగుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ సినిమా 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందనే వార్తలు ట్రేడ్ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఇటీవల కాలంలో ఏ సినిమాకి కూడా ఆ రేంజ్ లో క్రేజ్ రాలేదనే చెప్పాలి. అందుకే ఈ చిత్రాన్ని హిందీ చిత్రాలు తమ రిలీజులను వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడింది.

"పుష్ప 2: ది రూల్" చిత్రాన్ని ముందుగా ఆగస్టు 15న విడుదల చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. అయితే అదే డేట్ 'సింగం ఎగైన్' సినిమాని థియేటర్లలోకి తీసుకురావాలని భావించారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, కరీనా కపూర్ ఖాన్, దీపికా పదుకునే వంటి బాలీవుడ్ స్టార్స్ కలిసి నటించిన మూవీ ఇది. అంత పెద్ద స్టార్ కాస్టింగ్ తో రూపొందుతున్నప్పటికీ, మేకర్స్ 'పుష్ప 2' ని చూసి వెనక్కి తగ్గారు.

ఇండిపెండెన్స్ డేకి 'పుష్ప: ది రూల్' వస్తుందనే ఉద్దేశ్యంతో 'సింగం ఎగైన్' మూవీని నవంబర్ 1వ తేదీకి పోస్ట్ పోన్ చేసుకున్నారు. అయితే అనుకున్న సమయానికి పనులు జరగకపోవడంతో 'పుష్ప 2' మేకర్స్ డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఒకరోజు ముందుగా, అంటే డిసెంబర్ 5నే విడుదల చేయనున్నారని సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికే, చిత్ర యూనిట్ గురువారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది

ఇదిలా ఉంటే 'పుష్ప 2' క్రేజ్ చూసి, డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న మరో భారీ బాలీవుడ్ మూవీ "ఛావా" వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఛత్రపతి శివాజీ పెద్దకుమారుడు, మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ జీవిత కథ ఆధారంగా, భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఎపిక్ హిస్టారికల్ డ్రామా ఇది. దీంట్లో విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న "ఛావా" చిత్రాన్ని డిసెంబరు 6వ తారీఖున విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నార్త్ మార్కెట్ లో ఈ సినిమాకి మంచి క్రేజ్ వుంది. కానీ ఉత్తరాదిలో 'పుష్ప 2' చుట్టూ నెలకొన్న బజ్ చూస్తుంటే, ఆ సినిమాని తట్టుకొని బాక్సాఫీస్ వద్ద నిలబడగలదా? అని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే చావా పోస్ట్ పోన్ గురించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. అయితే సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని బీటౌన్ లో మాట్లాడుకుంటున్నారు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 'పుష్ప 2', 'ఛావా' రెండు చిత్రాల్లోనూ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. నేషనల్ క్రష్ సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతాయా? లేదా వాటిల్లో ఒకటి వెనక్కి తగ్గుతుందా? అనేది ఈ వారంలో తెలిపోతుంది. ఒకవేళ విక్కీ కౌశల్ సినిమా పోస్ట్ పోన్ అయితే మాత్రం.. అల్లు అర్జున్ సినిమా నార్త్ లో ఎలాంటి పోటీ లేకుండా సోలోగా రిలీజ్ అవుతుంది. ఇది బాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ రాబట్టడానికి అవకాశం కల్పిస్తుంది.

Tags:    

Similar News