స్టార్ హీరోలకి తక్కువ సీన్స్ రాస్తున్నారా?

హీరో ఒక మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు, ఇంకో మూవీలో హీరో లేని సీన్స్ చిత్రీకరిస్తున్నారు. హీరోలు డేట్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన మీద కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

Update: 2024-10-18 03:30 GMT

టాలీవుడ్ స్టార్ హీరోలంతా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ప్యారలల్ గా రెండు మూవీస్ పూర్తి చెయ్యాలని చూస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే మేకర్స్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. హీరో ఒక మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు, ఇంకో మూవీలో హీరో లేని సీన్స్ చిత్రీకరిస్తున్నారు. హీరోలు డేట్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన మీద కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' పార్ట్-1.. సుజీత్ డైరెక్షన్ లో OG చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. పాలిటిక్స్ లో బిజీగా ఉండటంతో జనసేనాని వీలును బట్టి షూటింగ్స్ చేస్తూ వచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి టైంలో పవన్ డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు.

ఇన్నాళ్లూ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సెట్స్ లోనే 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ జరిగింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం విజయవాడ పరిసర ప్రాంతంలో ప్రత్యేకంగా సెట్స్ వేశారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ మీద ఓ భారీ వార్ సీక్వెన్స్ ను షూట్ చేసారు. యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో చిత్రీకరించిన ఈ యాక్షన్ సీక్వెన్స్ లో 400 - 500 మంది ఆర్టిస్టులు పాల్గొన్నారు. అక్టోబరు 14 నుంచి కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం హీరో లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 10 నాటికి చిత్రీకరణ పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

మరోవైపు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 'ఓజీ' టీమ్ కూడా తిరిగి షూటింగ్ మొదలుపెట్టింది. రామోజీ ఫిలిం సిటీలో నైట్ షూట్ తో తాజాగా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తో సహా పలువురు మెయిన్ ఆర్టిస్ట్స్ మీద కొన్ని సీన్స్ తీస్తున్నారు. పవన్ రెండు మూడు రోజుల్లో జాయిన్ అవుతారని సమాచారం. ఇదే షెడ్యూల్ లో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారని సమాచారం. అప్పటి వరకూ హీరోలేని సన్నివేశాలను షూట్ చేస్తారని తెలుస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' మూవీ చేస్తున్నారు. కల్కి వచ్చే వరకూ ఈ సినిమాలో హీరో లేని సీన్స్ తీస్తున్నారనే వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలే హను రాఘవపూడి డైరెక్షన్ లో 'ఫౌజీ' సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేసారు ప్రభాస్. మొదటి షెడ్యూల్ లో హీరో లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా ఆ మధ్య టాక్ వచ్చింది. సలార్-2 షూటింగ్ అనుకున్నప్పుడు కూడా ఇవే రూమర్స్ వినిపించాయి.

నిజానికి తెలుగు సినిమాల్లో హీరో లేని సన్నివేశాలు పెద్దగా ఉండవు. అది కూడా స్టార్ హీరో సినిమా అయితే, సీన్స్ అన్నీ ఆయన చుట్టూనే తిరుగుతుంటాయి. ఒకటి రెండు తప్ప ప్రతీ ఫ్రేమ్ లోనూ హీరో కనిపిస్తూనే ఉంటాడు. కానీ ఈ మధ్య కాలంలో భారీ చిత్రాల విషయంలో హీరో లేని సన్నివేశాలు తీయడం అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. మరి నిజంగానే మన దర్శకులు సినిమాలో హీరోలకి తక్కువ సీన్స్ రాస్తున్నారా? కథలో హీరో కంటే ఇతర పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నారా? లేదా స్టార్ హీరోలకి శ్రమ లేకుండా, షూటింగ్ లో ఇతర టెక్నిక్స్ ఏమైనా ఫాలో అవుతున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News