మరో స్టార్ హీరోని మెప్పించిన పైడిపల్లి?

టాలీవుడ్ లో స్లో అండ్ స్టడీగా సినిమాలు తీసే దర్శకులలో వంశీ పైడిపల్లి ఒకరు. 2007లో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన వంశీ.. సినిమా సినిమాకి గ్యాప్ తీసుకుంటూ వస్తున్నారు.

Update: 2024-10-11 16:07 GMT

టాలీవుడ్ లో స్లో అండ్ స్టడీగా సినిమాలు తీసే దర్శకులలో వంశీ పైడిపల్లి ఒకరు. 2007లో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన వంశీ.. సినిమా సినిమాకి గ్యాప్ తీసుకుంటూ వస్తున్నారు. ఈ పదిహేడేళ్ల కెరీర్ లో కేవలం ఆరు చిత్రాలను మాత్రమే తెరకెక్కించారు. చివరగా తమిళ్ లో విజయ్ తో 'వారసుడు' తీసి హిట్టు కొట్టిన దర్శకుడు.. ఈ సినిమా వచ్చి దగ్గర దగ్గర రెండేళ్లు కావొస్తున్నా ఇంతవరకూ తన నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, పైడిపల్లి వంశీ త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్నారని తెలుస్తోంది.

'వరిసు' సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వంశీ.. ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇందులో భాగంగా వర్సటైల్ హీరో ఆమీర్ ఖాన్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారట. ఇటీవలే స్టోరీ లైన్ ఓకే చేయించుకున్నారని, ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం, రెండేళ్ల సమయం తీసుకున్నా వంశీ గోల్డెన్ ఛాన్స్ అందుకున్నట్లే అనే కామెంట్స్ వస్తున్నాయి.

ఇకపోతే షాహిద్ కపూర్‌ తో సినిమా చేయడానికి వంశీ సన్నాహాలు చేసుకుంటున్నారని ఆ మధ్య ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ గోల్డ్‌ మైన్‌ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్న ఈ హిందీ ప్రాజెక్ట్ లో టాలీవుడ్ కు చెందిన ఓ అగ్ర నిర్మాత కూడా భాగం అవుతారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందనే మాట కూడా వినిపిస్తోంది. ఇద్దరిలో ఎవరితో చేస్తారో తెలియదు కానీ, ఏదైనా వీలైనంత త్వరగా ప్రకటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రభాస్ హీరోగా 'మున్నా' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన వంశీ పైడిపల్లి.. తొలి చిత్రంతోనే ఫ్లాప్ రుచి చూశాడు. ఆ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ తో 'బృందావనం' వంటి హిట్టు కొట్టాడు. ఇదే క్రమంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో తీసిన 'ఎవడు'.. అక్కినేని నాగార్జున, కార్తీలతో రూపొందించిన 'ఊపిరి' చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఇక మహేష్ బాబు హీరోగా తెరకెక్కించిన 'మహర్షి' మూవీతో నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్నారు. మరో నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని 'వారసుడు' సినిమా తీశారు.

ఇక్కడ మనం గమనిస్తే వంశీ పైడిపల్లి ఇప్పటి వరకూ అందరు స్టార్ హీరోలతోనే సినిమాలు చేశారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అక్కినేని నాగార్జున, కార్తీ, మహేష్ బాబు, విజయ్ వంటి అగ్ర హీరోలతో మాత్రమే కలిసి వర్క్ చేశారు. ఇప్పుడు అమీర్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరి వంశీ తన తదుపరి చిత్రాన్ని ఏ స్టార్ హీరోతో చేస్తారో, ఈసారి ఎన్నేళ్ళ సమయం తీసుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News