ఆ డైరెక్టర్ తో అఖిల్ సినిమా లేనట్లే!

ఇటీవల అఖిల్ కు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ స్టోరీ వినిపించారని వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ నచ్చడంతో అఖిల్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రూమర్లు చక్కర్లు కొట్టాయి.

Update: 2024-10-26 03:15 GMT

అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఎంత కష్టపడుతున్నా దానికి తగ్గ ఫలితం మాత్రం దక్కడం లేదు. చివరగా గతేడాది సమ్మర్ లో 'ఏజెంట్' సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న అఖిల్.. ఏడాదిన్నర గడిచినా ఇంతవరకూ తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇటీవల అఖిల్ కు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ స్టోరీ వినిపించారని వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ నచ్చడంతో అఖిల్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని అక్కినేని టీమ్ ఖండించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అఖిల్ ఇప్పుడు డైరెక్టర్ ను చూసి కాకుండా, బలమైన స్క్రిప్ట్‌లు సెలెక్ట్ చేసుకోవడంపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

'అఖిల్' సినిమాతో వివి వినాయక్ చేతుల మీదుగా హీరోగా పరిచయమయ్యాడు యూత్ కింగ్ అఖిల్. ఆ తర్వాత విక్రమ్ కె కుమార్, వెంకీ అట్లూరి, బొమ్మరిల్లు భాస్కర్, సురేందర్ రెడ్డి వంటి దర్శకులతో వర్క్ చేశారు. కానీ ఇప్పటి వరకూ తన రేంజ్ కు తగ్గ బ్లాక్ బస్టర్ హిట్టు సాధించలేకపోయారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా మాత్రం ఓ మోస్తరు విజయం అందుకుంది. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు అఖిల్.

ఇందులో భాగంగా రెండు కొత్త ప్రాజెక్ట్స్ కు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్ మురళీ కిశోర్‌ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. ఇది తిరుపతి బ్యాక్ డ్రాప్ లో రూపొందే రూరల్ మూవీ అనే టాక్ వినిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని రూపొందిస్తారని సమాచారం.

ఇక యూవీ క్రియేష‌న్స్ బ్యానర్ లో ఓ మూవీ చేయడానికి అఖిల్ ఒకే చెప్పారు. ఇది యంగ్ హీరో కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా అవుతుందని అంటున్నారు. ఈ చిత్రంతో అనిల్‌ కుమార్‌ అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. దీనికి 'ధీర' అనే టైటిల్ కూడా ప్ర‌చారంలో ఉంది. త్వరలోనే ఈ రెండు చిత్రాలను అధికారికంగా ప్రకటించి, సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని అక్కినేని హీరో భావిస్తున్నారు. ఏదేమైనా సక్సస్ సాధిస్తేనే అభిమానుల ముందుకు రావాలని అఖిల్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

మరోవైపు డైరెక్టర్ పూరి జగన్నాధ్ సాలిడ్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' వంటి బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ తర్వాత.. యంగ్ హీరోలతో సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గా సిద్ధు జొన్నలగడ్డకు స్టోరీ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అఖిల్ తో చేస్తారని రూమర్స్ వినిపించాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అఖిల్ టీమ్ తేల్చేసింది. మరి పూరీ నెక్స్ట్ మూవీ ఎవరితో ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News