రోడ్డు ప్రమాదంలో భర్త.. వేదనతో భార్య సూసైడ్

విజయవాడ శివారులో చోటుచేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారటమే కాదు.. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా షాక్ తింటున్నారు.

Update: 2024-10-09 06:07 GMT

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో విధి ఆడిన వింతనాటకంలో రోడ్డు ప్రమాదంలో భర్త మరణించాడు. అతని లేని జీవితం తనకు వద్దని అనుకున్న ఆమె.. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. విజయవాడ శివారులో చోటుచేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారటమే కాదు.. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా షాక్ తింటున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

విజయవాడ శివారులోని ప్రసాదంపాడుకు చెందిన 27 ఏళ్ల నాగరాజు ఒక హోటల్లో టిఫిన్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. అతడితో 22 ఏళ్ల ఉష ప్రేమలో పడ్డారు. వీరిద్దరి పెళ్లికి ఏడాది క్రితం పెద్దలు ఓకే చెప్పటంతో పెళ్లి చేసుకున్నారు. హోటల్లోని ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు వెళ్లి రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చేవాడు. ఎప్పటిలానే సోమవారం సాయంత్రం హోటల్ కు వెళ్లిన అతను.. అర్థరాత్రికి కూడా ఇంటికి తిరిగి రాలేదు.

మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయినట్లుగా ఉషకు సమాచారం వచ్చింది. షాక్ తిన్న ఆమె.. బంధువులతో కలిసి అక్కడికి వెళ్లింది. చనిపోయిన భర్తను చూసిన ఆమె గుండెలవిసేలా రోదించింది. గుణదలకు చెందిన ఇద్దరు కుర్రాళ్లు రాంగ్ రూట్ లో తమ టూవీలర్ మీద నుంచి వెళుతూ నాగరాజు టూ వీలర్ ను బలంగా ఢీ కొట్టారు. గాయాలతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. నాగరాజు మాత్రం చనిపోయాడు.

జరిగిన రోడ్డు ప్రమాదం గురించి పోలీసులకు కంప్లైంట్ చేసింది ఉష. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం కోసం బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంటికివెళ్లి వస్తానని వెళ్లిన ఉష.. భర్త లేని జీవితం తనకు వద్దనుకొని.. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయింది. కుమార్తె తీరుతో అనుమానం వచ్చిన ఆమె తల్లి ఇంటికి వెళ్లగా.. అప్పటికే ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు కుర్రాళ్ల నిర్లక్ష్యం ఒక జంట జీవితాల్ని అర్ధాంతరంగా ముగిసేలా చేసింది. ఈ విషాద ఉదంతం స్థానికంగా పలువురిని కదిలించింది.

Tags:    

Similar News