''పార్ల‌మెంటుపై దాడి.. నేనే బాధ్య‌త వ‌హిస్తా''

మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు

Update: 2023-12-13 10:34 GMT

భార‌త పార్ల‌మెంటుపై ఇద్ద‌రు ఆగంత‌కులు జ‌రిపిన దాడికి సంబంధించిన ద‌ర్యాప్తు, భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై స్పీక‌ర్ ఓం బిర్లా స్పందించారు. భ‌ద్ర‌తా వైఫ్య‌లం, త‌దుప‌రి దర్యాప్తు వంటి కీల‌క అంశాల‌కు తానే బాధ్య‌త వ‌హిస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని, దానికి పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించాలని పట్టుబట్టారు.

దీనికి స్పీకర్‌ ఓం బిర్లా స్పందిస్తూ.. ‘‘లోక్‌సభ లోపల ఇద్దరు దుండగులు, బయట మరో ఇద్దర్ని అదుపు లోకి తీసుకున్నాం. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతాం. ఆ పూర్తి బాధ్యత నాదే. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు`` అని బిర్లా వ్యాఖ్యానించారు.

అయితే, నిందితులు వదిలిన గ్యాస్‌ ఏమిటనే దానిపై సమగ్ర విచారణ జరుపుతున్న‌ట్టు తెలిపారు. దీనిపై ఈ సాయంత్రం సమావేశం నిర్వహిస్తాం. సభ్యుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామ‌ని వెల్లడించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే.. సభ సజావుగా నిర్వహించడం మనందరి బాధ్యత అని స్పీకర్‌ అన్నారు.

మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో లోక్‌సభలో దుండగులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. సందర్శకులు కూర్చునే గ్యాలరీ నుంచి ఓ వ్యక్తి సభలోకి దూకగా.. మరో వ్యక్తి గ్యాలరీ వద్ద ఒకరకమైన గ్యాస్‌ను వదిలి భయభ్రాంతులకు గురిచేశారు. అదే సమయంలో పార్లమెంట్‌ భవనం వెలుపల మరో ఇద్దరు రంగుల పొగలు వదిలారు. అదే ఇత‌ర పేలుడు ప‌దార్థాలు ఏమైనా అయి ఉంటే.. పెను ప్ర‌మాదం జ‌రిగి ఉండేద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

Tags:    

Similar News