ఒంటరితనాన్ని ఇష్టపడుతున్న పెద్దోళ్లు... కారణం ఇదేనంట!

చాలా మందికి ఎక్కువ మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని అనిపిస్తుంటుంది.

Update: 2024-10-01 15:30 GMT

చాలా మందికి ఎక్కువ మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని అనిపిస్తుంటుంది. నిత్యం ఇంట్లో పిల్లా పాపలు, మనవలు మనవరాండ్రతో సందడిగా ఉండాలని భావిస్తుంటారు. అయితే ఇంకొంతమంది మాత్రం మానసికంగా చాలా అలసిపోయే, విసిగిపోయో, లేక.. సహజంగా వారికున్న అలవాటులో భాగంగానో ఒంటరిగా ఉండాలని భావిస్తుంటారు.

ఏకాంతంలో ఉన్న మజా చాలా గొప్పదని చెబుతుంటారు. తమతో తాము మాట్లాడుకునే అవకాశం ఉంటుందని అంటుంటారు. ఇదే సమయంలో మరికొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఈ ఒంటరితనాన్ని ఇష్టపడటానికి గల కారణాలుగా చెబుతుంటారు! ఈ సమయంలో ఇప్పుడు పెద్దోళ్లలో ఇదే తరహా ధోరణి పెరుగుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

అవును... దేశంలో వయసు మళ్లిన వారిలో ఒంటరిగా నివసించే ధోరణి పెరుగుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. "ఏజ్ వెల్ ఫౌండేషన్" అనే సంస్థ సెప్టెంబరులో దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతల్లోని సుమారు 10వేల మందిపై ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఇందులో భాగంగా... వయసు మళ్లిన వారిలో 14.3 శాతం మంది ఒంటరిగా జీవిస్తున్నట్లు వెల్లడైందని తెలిపింది. ఈ విషయంలో ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో 15 శాతం మంది ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య కాస్త తక్కువగా 13.4 శాతంగా ఉంది. ఇందులో 46.5 శాతం మంది మహిళలే ఉన్నారని ఈ అధ్యయనంలో తేలినట్లు చెబుతున్నారు.

ఇలా జీవిస్తున్నవారిలో 46.9% మంది తాము ఈ ఒంటరిగా జీవించడం వల్ల సంతోషంగా ఉన్నట్లు చెప్పగా.. 41.5% మంది మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఒంటరిగా ఉండటం వల్ల తమ ఆరోగ్యం బాగుంటోందని 32% మంది చెప్పగా.. మన మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని 41% మంది పేర్కొన్నారని అంటున్నారు.

అయితే... ఇలా ఒంటరిగా ఉండాలని భావిస్తున్న వారిలో చాలా అమంది ఆర్థిక, సామాజిక స్వాతంత్రంపై ప్రాధాన్యత పెరగడమే కారణం అని అంటున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News