ఆ పని చేయలేనన్న జగన్...ట్రోలింగే ట్రోలింగ్ !

రాజకీయాల్లో ఉన్నపుడు ఎక్కడో పప్పులో కాలు వేయడం జరుగుతుంది. ఒకటి కూడా కాదు సవాలక్ష చేస్తారు.

Update: 2024-10-18 04:05 GMT

రాజకీయాల్లో ఉన్నపుడు ఎక్కడో పప్పులో కాలు వేయడం జరుగుతుంది. ఒకటి కూడా కాదు సవాలక్ష చేస్తారు. అయితే మేము ఏ తప్పూ చేయలేదని అంతా చెప్పుకుంటూంటారు. వాటిని వారు కన్వీనియెంట్ గా మరచిపోయినా తవ్వి తీయడానికి ప్రత్యర్ధి పక్షాలు రెడీగా ఉంటాయి.

ఇక చూస్తే ఒక తప్పు పొరపాటు అయినా వంద చేసినా ఒక్కటే కాబట్టి ఈ రాజకీయాన్ని పూర్తిగా వాస్తవికతతో ఆలోచించి చేసుకుంటే పోలా అని చూసే వారే ఎక్కువ మంది ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ విషయం తీసుకుంటే కొంత డిఫరెంట్ గా కనిపిస్తారు.

ఆయన పబ్లిక్ మీటింగులో పార్టీ మీటింగులో కూడా విలువలు విశ్వసనీయత గురించి ఎక్కువగా మాట్లాడుతూంటారు. తాను చెప్పినదే చేస్తాను చేయనిది చెప్పను అని అంటారు. అధికారం కోసం అబద్ధాలు ఆడడం తనకు చేత కాదని జగన్ చెప్పేస్తారు.

తాజాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ పార్టీ నాయకులతో మాట్లాడుతూ ఒకింత భావోద్వేగానికి గురి అవుతూనే తాను అబద్ధాలు చెప్పలేదు కాబట్టే ఓడాను అని అన్నారు. అయినా ఓటమి గెలుపు రాజకీయాల్లో మామూలే అని ఆయన సమర్ధించుకున్నారు. తాను అబద్ధాలు చెప్పలేనని ఆయన ఒప్పుకున్నారు.

తప్పుడు హామీలు ఇస్తే అధికారం దక్కుతుంది కానీ విలువలు విశ్వసనీయత ఎప్పటికైనా ముఖ్యమని జగన్ అన్నారు. అందుకే తాను ఆ పని ఎప్పటికీ చేయనని ఆయన స్పష్టం చెశారు. కేవలం పవర్ దక్కాలని తాను ఎప్పటికీ అలాంటి మాటలు చెప్పలేను అని ఆయన కుండబద్దలు కొట్టారు.

తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలు ప్రశ్నిస్తారు అని ఆయన అన్నారు. అలా ప్రజల ప్రశ్నలకు గురి కాకుండా ప్రతిపక్షంలో ఉండడమే మేలు అన్నదే తన విధానం అన్నారు. జగన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ పార్టీలోని క్యాడర్ కి ఎమోషనల్ ఫీలింగ్ కలిగిస్తోంది.

అధినేత చిత్తశుద్ధి నిజాయితీ ఇదీ అని వారు అనుకునేలా చేస్తోంది. తప్పుడు హామీలు మా నాయకుడు ఇవ్వలేడు అని వారు భావించేలా చేస్తోంది. అదే సమయంలో జగన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తో సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతున్నాయి. జగన్ అబద్ధాలు ఆడలేదా అది నిజమా అంటూ ఆయన 2019లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని కానీ గతం కంటే ఎక్కువ మద్యం తన పాలనలో అమ్మి ఎక్కువగా ఆదాయం తెచ్చారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. అది తప్పుడు హామీ కాదా జగన్ అని నిలదీస్తున్నారు.

కేవలం అదొక్కటే కాదని జగన్ అనేక హామీలు 2019 ఎన్నికల వేళ ఇచ్చారని అలా వాటిని అధికారంలోకి రాగానే మరచిపోయారని విమర్శిస్తున్నారు. మొత్తం మీద చూస్తే కనుక జగన్ ఇచ్చిన ఈ ఎమోషనల్ స్టేట్మెంట్ మాత్రం సోషల్ మీడియాలో కూటమి నేతలకు ఒక ఆయుధంగా మారింది అని అంటున్నారు ఇది జగన్ తన చిత్తశుద్ధిని చాటుకోవడానికి ఇచ్చిన స్టేట్మెంట్ అయినప్పటికీ ఇది ఆయన తనను తాను ఎలివేట్ చేసుకునేందుకు వేసిన ఎత్తుగడగా కూటమి నేతలు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News