జగన్ ఢిల్లీ ప్రోగ్రాం ఫెయిల్ అయిందా ?

ఎంతో ఆర్భాటంగా ఢిల్లీ ధర్నా కార్యక్రమాన్ని జగన్ ప్రకటించారు. వైసీపీ ఏ కార్యక్రమం చేపట్టినా అది ఒక బిగ్ వేలో ఉంటుంది

Update: 2024-07-24 14:53 GMT

ఎంతో ఆర్భాటంగా ఢిల్లీ ధర్నా కార్యక్రమాన్ని జగన్ ప్రకటించారు. వైసీపీ ఏ కార్యక్రమం చేపట్టినా అది ఒక బిగ్ వేలో ఉంటుంది. సిద్ధం సభల నుంచి చూస్తే అలాగే సాగుతూ వస్తున్నాయి. ఎటు చూసినా జనమే జనం అన్నట్లుగానే కనిపించేలా డిజైన్ చేయడంతో వైసీపీ ఎపుడూ ముందు ఉంటుంది.

కానీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన వైసీపీ ధర్నా మాత్రం అనుకున్నట్లుగా సాగలేదని అంటున్నారు. ఒక విధంగా చూస్తే పార్టీ జనాలు తక్కువగా హాజరై పేలవంగా సాగింది అని అంటున్నారు. ఏపీలో వైసీపీ ఓడినా పార్టీ బలంగానే ఉంది అని చెప్పడానికే ఈ ధర్నా ఉద్దేశ్యం అనుకుంటే అది కాస్తా వికటించింది అని అంటున్నారు.

చాలా చోట్ల వైసీపీకి చెందిన ఇంచార్జులు హాజరు కాలేదు అని అంటున్నారు. ఒక విధంగా విశ్లేషిస్తే డెబ్బై శాతం ఇంచార్జులు ఢిల్లీ ధర్నాకు డుమ్మా కొట్టారని అంటున్నారు. ఇక వచ్చిన ఇంచార్జిలు సైతం తమ వెంట పట్టుమని అయిదుగురు నేతలను కూడా తీసుకుని రాలేదని కూడా అంటున్నారు.

ఇక ఓవరాల్ గా చూస్తే ఈ ధర్నాకు అనుకున్న స్థాయిలో బజ్ అయితే రాలేదు అని అంటున్నారు. రాంగ్ టైమింగ్ హడావుడితో పాటు ఒవర్ కాన్ఫిడెన్స్ తో వైసీపీ ఈ ధర్నాను చేసినట్లుగా కనిపిస్తోంది అన్న మాట కూడా ఉంది. అందుకే జనాలను గట్టిగా మొబలైజ్ చేసినట్లుగా లేదని అంటున్నారు.

ఇక్కడ వైసీపీని వైసీపీతోనే పోలిక పెడుతున్నారు. 2014 నుంచి 2019 దాకా వైసీపీ విపక్షంలో ఉంది. ఆ టైం లో చూస్తే వైసీపీ ఎక్కడ ఏ ఆందోళన చేపట్టినా జనమే జనంగా సాగుతూ వచ్చింది. అంతే కాదు అప్పట్లో రెండు సార్లు ఢిల్లీలో ఈ రకంగానే ధర్నాలు చేస్తే జనాలు కుప్పలు తెప్పలుగా వచ్చారు.

అంటే అపుడు ప్రతీ ఇంచార్జి అలాగే ఎమ్మెల్యేలు కూడా ఈ మొత్తం కార్యక్రమమలో తుచ తప్పకుండా పాల్గొన్నారు. దాంతోనే వారంతా మనసు పెట్టి చిత్తశుద్ధితో పనిచేశారు అని చెప్పాలి. దీంతో వైసీపీ ధర్నాలు అన్నీ కళ కట్టాయి. ఇపుడు అయితే ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది అని అంటున్నారు.

ఇక చూస్తే కొన్ని జిల్లాల్లో అయితే అక్కడ నుంచి ఒక్క ఇంచార్జి కూడా ఢిల్లీ వైపు చూడలేదు అన్న చర్చ ఉండనే ఉంది. అవి ఉమ్మడి జిల్లాలు అయినా కొత్త జిల్లాలు అయినా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు ఇచ్చినప్పటికీ చాలా మంది నేతలు ముఖం చాటేశారు అని అంటున్నారు. వారంతా నిన్నటిదాకా అధికార పదవులు అనుభవించిన వారే. మరో వైపు చూస్తే ఈ రోజుకీ ఇంకా గద్దె మీద స్థానిక సంస్థలలో అత్యధికంగా వైసీపీ నేతలే ఉన్నారు.

వారంతా తరలివచ్చినా కూడా వైసీపీ ధర్నాకు ఒక లెవెల్ లో సాగేది అని అంటున్నారు. కానీ ఎవరూ పెద్దగా ఆసక్తిని చూపించలేదని అంటున్నారు. పార్టీ ఓటమి తరువాత నిర్వహించే తొలి ఆందోళన. దీంతో పార్టీ తిరిగి ఉనికి చాటుకుని ఉత్తేజపూరితం కావాల్సి ఉన్న సందర్భం. ఒక విధంగా వైసీపీకి రాజకీయంగా ఇది ముఖ్యమైన ఆందోళన. ఏపీలో చూస్తే ఎన్నడూ లేనంత వీక్ గా వైసీపీ పొజిషన్ ఉంది. ఈ సమయంలో అంతా కలసి ఐక్యంగా పోరాడుతామని సందేశం పంపించాల్సి ఉంది.

అయితే ఇంతటి ముఖ్య కార్యక్రమానికి పార్టీ జనాలు రాకపోవడం అంటే ఆలోచించాల్సిందే. ఇక వైసీపీ అయిదేళ్ల ప్రభుత్వంలో రెండు విడతలుగా చూసుకుంటే నలభై మంది కంటే ఎక్కువ మందే మంత్రులుగా చేశారు. వారిలో నాలుగవ వంతు కూడా హాజరు కాలేదని అంటున్నారు.

అలాగే 151 మంది ఎమ్మెల్యేల్లో చూస్తే మూడవ వంతు వచ్చినా ధర్నా గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. ధర్నాకు ఎందుకు వీరు రాలేదు అంటే చాలా కారణాలు వినిపిస్తున్నాయి. చాలా మంది తన సొంత రాజకీయ భవిష్యత్తుని వెతుక్కుంటున్నారు అని అంటున్నారు. దాంతో వైసీపీలో తాము కనిపిస్తే తమ ప్రయత్నాలు వేస్ట్ అవుతాయని ఆలోచించే రాలేదు అని ప్రచారం అయితే సాగుతోంది.

మరి కొంతమంది ఓటమి బాధ నుంచి తేరుకోలేదు. రాజకీయంగా వైరాగ్యం చూపిస్తున్నారు అని అంటున్నారు. దాంతో వారు మౌనంగా ఉంటున్నారు. ఇంకొందరు అయితే ఇప్పటి నుంచే పోరాటాలకు సిధ్ధంగా లేరు అని అంటున్నారు. అయిదేళ్ళ అధికారం నిండుగా కూటమికి ఉంది. దాంతో తాము ఎందుకు బయటపడాలని ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. మరికొంతమంది వైసీపీ అధినాయకత్వం పోకడల పట్ల అసంతృప్తితో దూరంగా ఉంటున్నారని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ ధర్నా మీద ఇవన్నీ ప్రభావం తీవ్రంగా చూపాయని అంటున్నారు.

Tags:    

Similar News