తెలంగాణ‌లో కేఏ పాల్ ప్ర‌భుత్వం... సీట్లెన్నో తెలుసా?

అయితే, తెలంగాణ రాజ‌కీయాల‌లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల‌లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని పాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Update: 2023-09-06 02:30 GMT

తెలంగాణ మంత్రి మ‌ల్లారెడ్డికి సోష‌ల్ మీడియాలో ఉన్న పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న మంత్రి మ‌ల్లారెడ్డి, అడ‌పాద‌డ‌పా మీడియాతో మాట్లాడుతున్న‌ప్ప‌టికీ అవి ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతుంటాయి. మ‌రోవైపు ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు, మ‌త‌ ప్ర‌బోధ‌కుడు కేఏ పాల్ గురించి రాజ‌కీయ వ‌ర్గాలు, నెటిజ‌న్లు అనే తేడా లేకుండా ఎప్పుడూ హాట్ హాట్ చ‌ర్చ జ‌రుగుతుంటుంది. అయితే, ఈ ఇద్ద‌రు నేత‌లు తాజాగా కీల‌క అంశంలో వార్త‌ల్లో నిలిచారు. మ‌ల్లారెడ్డి బీపీ పెంచేలా కేఏ పాల్ బూతులు మాట్లాడ‌ట‌మే దీనికి కార‌ణం.

మీడియాతో మాట్లాడే అవ‌కాశం దొర‌క‌డ‌మే ఆల‌స్యం... అన్ని అంశాల‌పై త‌న‌దైన శైలిలో మాట్లాడే ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా కూడా అదే రీతిలో తెలంగాణ‌, ఏపీ రాజ‌కీయాల‌పై కామెంట్లు చేశారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది కాబ‌ట్టే వచ్చే ఎన్నికల విష‌యంలో జమిలి జ‌పం చేస్తోంద‌ని పాల్ కామెంట్ చేశారు. బీజేపీ దూకుడు చూసి కాంగ్రెస్ కూట‌మి క‌డుతోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అయితే, తెలంగాణ రాజ‌కీయాల‌లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల‌లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని పాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముందు ఈ రెండు పార్టీలు కోవర్టుల‌పై దృష్టి పెట్టాల‌ని పాల్ హిత‌వు ప‌లికారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఆయ‌న త‌న‌యుడైన మంత్రి కేటీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నార‌ని పాల్ ఘాటు కామెంట్లు చేశారు. వీరికి మ‌ద్ద‌తుగా నిలిచే నేత‌లు సైతం ఈ దోపిడీలో భాగం క‌లిగి ఉన్నారని ఆయ‌న ఆక్షేపించారు.వారి దోపిడికి బ్రేక్ వేసేందుకు ధరణి విషయంలో కోర్టులో పిల్ వేసేందుకు తాను ప్ర‌య‌త్నిస్తుంటే, తనను అడ్డుకుంటుందని ఆరోపించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ల‌కు మ‌ద్దతుగా మాట్లాడే మంత్రి మల్లారెడ్డి పిచ్చోడంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన కేఏ పాల్‌, మ‌ల్లారెడ్డికి సమాజంపై అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రాబోయే మూడు నెలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని, అనంత‌రం జ‌రిగే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ 119 స్థానాల్లో పోటీ చేసి 79 స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేఏ పాల్ తెలిపారు. సెప్టెంబర్ 7 వ తేదీన ప్రజాశాంతి పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని కేఏ పాల్ ప్ర‌క‌టించారు.

సొంత పార్టీ పెట్టి దాన్ని న‌డిపించ‌లేక కాంగ్రెస్ లో విలీనం చేసేస్తున్న వైఎస్ షర్మిలకు ఓటు అడిగే హక్కు లేదని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. పవన్ క‌ళ్యాణ్ ఆంధ్రాలో ప్యాకేజీ స్టార్ అని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను అగ్రకులాలను త‌మ అధికారం కోసం వాడుకుంటున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన కేఏ పాల్‌... టికెట్ల కోసం ఆ పార్టీల‌ను ఆశ్ర‌యించే బ‌దులుగా త‌న దగ్గరకు వ‌స్తే తాను సీట్లు ఇస్తానని కేఏ పాల్ భ‌రోసా ఇచ్చారు.

Tags:    

Similar News