పోలీసుల డీపీతో పేరెంట్స్ ట్రాప్ తెలంగాణలో కొత్త మోసం!

ఈ క్రమంలోనే తెలంగాణలో తాజాగా సైబర్ నేరగాళ్ల నయాదందా తెరపైకి వచ్చింది.

Update: 2024-08-03 09:30 GMT

కాదేదీ సైబర్ నేరానికి అనర్హం అన్నట్లుగా కాలం మారిపోయిన పరిస్థితి. ఎంత అప్రమత్తంగా ఉన్నా చాలా మంది ఏదో రూపంలో వీరి బారిన పడుతూనే ఉన్నారు. కొతమంది తప్పుచేసి బ్లాక్ మెయిల్స్ కి బలైపోతుంటే.. ఏ తప్పూ చేయకుండానే ఇంకొంతమంది సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో తాజాగా సైబర్ నేరగాళ్ల నయాదందా తెరపైకి వచ్చింది.

అవును... సైబర్ నేరగాళ్లు ఇటీవల కాలంలో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. వారికీ సిటీల్లో ఉన్నవారు, గ్రామాల్లో ఉన్నవారూ అనే తారతమ్యాలేవీ లేవు! వీరి మాటలు నమ్మినోళ్లే వీళ్లకు అక్షయపాత్రలుగా మారుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ లో తమ పిల్లలు నేరాలు చేశారనే పేరుతో పోలీసుల్ల పేరెంట్స్ కి ఫోన్ చేసి బెదిరించి డబ్బులు వసూల్ చేస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ఉపాధి కోసం బయట దేశాలకు వెళ్లిన వారున్న కుటుంబాలు, పై చదువులకోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి కుటుంబాలే లక్ష్యంగా తాజాగా సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తమ తమ ఫోన్స్ లో పోలీసుల డీపీలు వాడుకుని మరీ చెలరేగిపోతున్నారు. ఇలా వారి ఫోన్ నెంబర్ కు పోలీస్ డీపీ ఉండటంతో బాధితులు ఈజీగా బలైపోతున్నారు.

ఇందులో భాగంగా ఇటీవల నిజామాబాద్ జిల్లాలో... పలువురు పేరెంట్స్ కి పోలీసులం అంటూ పలు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇందులో... మీ మీ పిల్లలు గంజాయి, డ్రగ్స్ తో పట్టుబడ్డారంటూ పోలీసులకు ఫోన్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఈ సందర్భంగా మీ మీ పిల్లలను విడిచిపెట్టాలంటే డబ్బులు పంపాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

దీంతో ఊరుగారి ఊరిలో తమ పిల్లలు నిజంగానే చిక్కుకున్నారేమో అని ఆందోళన చెందిన తల్లితండ్రులు.. సైబర్ నేరగాల్లు అడిగిన సొమ్మును పంపిస్తున్నారు. ఈ రకంగా సైబర్ కేటుగాల్లు సుమారు పది మంది వద్ద లక్షల్లో కాజేశారని తెలుస్తోంది. ఈ తరహా దందా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో యదేచ్చగా జరుగుతుందని అంటున్నారు.

ఇలా డబ్బులు పంపేసిన తర్వాత పిల్లల వద్ద నుంచి ఫోన్ రావడంతో అసలు బండారం బయటపడిందని తెలుస్తోంది. దీంతో... పిల్లల పేరు చెప్పగానే నమ్మి మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో... కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు.. పలు సూచనలు చేస్తున్నారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎవరైనా పోలీసుల పేరుచెప్పి ఫోన్ చేస్తే స్పందించొద్దని.. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రధానంగా 12 సెంబర్స్ తో ఫోన్ కాల్స్ వస్తే స్పందించొద్దని నొక్కి చెబుతున్నారు.

Tags:    

Similar News