విజయమ్మ తటస్థతపై ఓపెన్ అయిపోయిన "సాక్షి"!

ఈ విషయంలో వైసీపీ నేతలు, వైఎస్సార్ బంధువులూ వరుసగా మైకుల ముందుకు వచ్చి షర్మిలపై విమర్శల వర్షాలు కురిపిస్తున్నారు.

Update: 2024-10-28 12:11 GMT

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న అత్యంత హాట్ టాపిక్స్ లో ఒకటి వైఎస్సార్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివాద వ్యవహారం అని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఈ విషయంలో వైసీపీ నేతలు, వైఎస్సార్ బంధువులూ వరుసగా మైకుల ముందుకు వచ్చి షర్మిలపై విమర్శల వర్షాలు కురిపిస్తున్నారు.

ఈ సమయంలో... జగన్ తీరుపై తమ తల్లి విజయమ్మ కుమిలిపోతోందని, కన్నీటిపర్యంతమైందని.. ఇలాంటివి చూడటానికా తానింకా బ్రతికి ఉన్నానా అని తల్లడిల్లుతోందని షర్మిల కామెంట్స్ చేశారు. అయితే... ఇంత జరుగుతున్నా విజయమ్మ మౌనంగా ఉంటున్నారనో ఏమో కానీ.. తాజాగా సాక్షిలో ఓ ఆసక్తికర కథనం ప్రచురితమైంది.

అవును... షర్మిల చేసిన పని లీగల్ గా జగన్ కి ఇబ్బందులు తెచ్చే విషయమని వైసీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో... తన చర్యలు కుమారుడి బెయిల్ రద్దు పరిస్థితికి దారి తీసే ప్రమాదం ఉందని తెలిసినా ఆ కుట్రలకు విజయమ్మ పరోక్షంగా సహకరించడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది అంటూ “సాక్షి” తాజాగా ఓ కథనాన్ని ప్రచురించి.

ఈ కథనంలో విజయమ్మ తటస్థతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని అంటూ అందులో పేర్కొన్న అంశాలు.. ఆమె రియాక్షన్ ను ఆశిస్తునంట్లున్నాయని అంటున్నారు. సరస్వతి షేర్ల ట్రాన్స్ ఫర్ పత్రాలపై సంతకాలు చేయడాన్ని ప్రస్థావించిన ఈ కథనం... "న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా కూడా" విజయమ్మ సంతకం చేశారనే విషయాన్ని నొక్కి చెబుతుంది.

ఇదే సమయంలో... “సార్వత్రిక ఎన్నికల సమయంలో కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న సమయంలో విదేశాల నుంచి విజయమ్మ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వీడియో సందేశాన్ని విడుదల చేయటాన్ని గుర్తు చేస్తున్నారు”.. అంటూ ఈ కథనం మరోసారి ఆ విషయాన్ని ప్రస్థావిస్తూ.. విజయమ్మ వ్యవహార శైలి గత కొంతకాలంగా ఇలానే ఉందన్నట్లు చెప్పే ప్రయత్నం చేసిందని అంటున్నారు.

ఇదే సమయంలో... “ఇద్దరు పిల్లలను సమానంగా చూడాల్సిన అమ్మ ఒకవైపే మొగ్గడం సరికాదని.. షర్మిల అత్యాశ, కుతంత్రాల్లో అమ్మను కూడా పావుగా వాడుకుందని.. తప్పుడు ప్రకటనలకు అమ్మను ఓ సాక్షిగా, అమలుకర్తగా చేశావంటూ వైఎస్ జగన్ తన సోదరికి రాసిన లేఖను గుర్తుచేస్తున్నారు” అంటూ చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పారనే చర్చకు తెరలేపిందని అంటున్నారు.

దీంతో... ఈ కథనం ఏమి చెప్పాలనుకుంటుంది.. విజయమ్మ తెలిసే తప్పు చేస్తున్నారనా..? లేక, ఆమె జగన్ కు వ్యతిరేకంగా ప్రవర్తించేలా షర్మిళ ప్రొవోక్ చేస్తున్నారనా..? అదీగాక తనను తన చెల్లి షర్మిలతో పాటు తల్లి కూడా తనను మానసిక క్షోభకు గురిచేస్తుందని చెప్పాలనా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News