మెదక్ నీకు అప్పజెప్తున్నా.. హరీశ్.. సీఎం మాట దేనికి సంకేతం?

ఇందులో మెదక్ అసెంబ్లీ స్థానం ఇప్పుడు సంక్లిష్టంగా మారింది. దీనికి కారణం.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన తీవ్ర వ్యాఖ్యలే

Update: 2023-08-24 05:30 GMT

కీలక ప్రకటన చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 119 అసెంబ్లీ స్థానాలకు 115 స్థానాలకు అభ్యర్థుల్ని మొదటి విడతలోనే పూర్తి చేయటం ద్వారా రికార్డును క్రియేట్ వైనం తెలిసిందే. మొత్తం జాబితాలో90 శాతానికి పైనే అభ్యర్థులను ముచ్చటగా మూడోసారి ఓకే చేసిన వైనంపై గులాబీ తోటలో కొత్త తలనొప్పుల్ని తీసుకొచ్చింది. ఇందులో కొన్ని స్థానాల విషయంలో రగడ అంతకంతకూ ముదురుతోంది.

ఇందులో మెదక్ అసెంబ్లీ స్థానం ఇప్పుడు సంక్లిష్టంగా మారింది. దీనికి కారణం.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన తీవ్ర వ్యాఖ్యలే. ఈ సీటును తనకు కేటాయించాలని కోరుతున్నప్పటికీ.. అలాంటి అవకాశం లేకుండా చేసిన వైనం మైనంపల్లిని కలిచివేస్తోంది. గడిచిన మూడేళ్లుగా నిర్విరామంగా తన కొడుకు శ్రమించి.. నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ను సొంతం చేసుకున్న వేళ.. తమకు కాకుండా ఆరోపణలు.. విమర్శలు ఉన్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ కు ఇవ్వటాన్ని తప్పుపడుతున్నారు.

ఈ క్రమంలో పద్మకు సీటు రావటంపై మంత్రి హరీశ్ మీద నిప్పులు చెరుగుతున్నారు. రూ.లక్షకోట్ల అవినీతి చేశారంటూ సంచలన ఆరోపణలు చేసిన మైనంపల్లి మాటలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా జరిగిన మెదక్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. గులాబీ బాస్ టికెట్లు ప్రకటించే వేళలో తిరుమలలో ఉన్న మైనంపల్లి.. జాబితాను ప్రకటించటానికి కొన్ని గంటల ముందు మంత్రి హరీశ్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేయటం.. దానికి ప్రతిగా ముఖ్యమంత్రి సైతం మైనంపల్లిని పెద్దగా సీరియస్ గా తీసుకోకపోవటం తెలిసిందే. అంతేకాదు.. బయటకు వెళితే వెళతారన్నట్లుగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తర్వాతి రోజు మైనంపల్లి రియాక్టు కావటం తెలిసిందే.

తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు విధేయుడ్ని అంటూనే.. తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోవటాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. ఈ రోజు (గురువారం) నియోజకవర్గానికి తిరిగి వస్తున్న వేళ.. ఆయన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. బుధవారం మెదక్ లో జరిగిన బహిరంగ సభలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతను మంత్రి హరీశ్ కు అప్పజెప్పిన వైనం చూస్తే.. మైనంపల్లికి గట్టి సంకేతాల్ని ఇచ్చినట్లుగా అర్థమవుతుంది.

ఎమ్మెత్యే పద్మ తన బిడ్డ అని.. తెలంగాణ ఉద్యమం మొదటి రోజు నుంచి తనతో ఉందన్న కేసీఆర్.. మెదక్ పట్టణాన్ని హరీశ్ చేతికి అప్పజెప్పి.. దాన్ని సిద్దిపేట తరహాలో డెవలప్ చేయాలన్నారు. పద్మను దీవించి గతానికి మించిన మెజార్టీతో గెలిపిస్తే.. ప్రజలు కోరుకున్న డిమాండ్లు మొత్తం పూర్తి చేసే బాధ్యత తనదన్న కేసీఆర్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

మెదక్ పట్టణాన్ని బ్రహ్మండంగా తీర్చిదిద్ది.. ఆదర్శవంతమైన నియోజకవర్గంగాతీర్చిదిద్దేబాధ్యత మంత్రి హరీశ్ రావుకు అప్పజెబుతున్నట్లుగా పేర్కొన్న వైనం చూస్తే.. రానున్న రోజుల్లో మైనంపల్లి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటే సిద్ధంగా ఉండాలన్న సంకేతాన్ని ఇచ్చినట్లుగా చెప్పాలి. మరి.. మెదక్ టికెట్ విషయంపై మైనంపల్లి ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

Tags:    

Similar News