మోడీ పీఎం : వైసీపీ ఎమ్మెల్యేలకు 20 లక్షలు... టీడీపీ ఎమ్మెల్యేలకు నలభై లక్షలు?

అందులో వాటాగా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలకు కూడా ప్రతీ నెలా ఒక్కో డీలర్ నుంచి సొమ్ము అందుతోంది.

Update: 2024-07-10 03:31 GMT

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రారంభించిన ఉచిత బియ్యం పధకం ఏపీలో పెద్ద ఎత్తున అవినీతికి బాటలు వేస్తోంది. రేషన్ కార్డుదారులకు కిలో రూపాయి వంతున బియ్యం ఇస్తున్నారు. అయితే ఈ బియ్యాన్ని లబ్దిదారులు ఎవరూ తీసుకోవడం లేదు. అక్కడే మొత్తం గోల్ మాల్ జరుగుతోంది. ఈ బియ్యాన్ని డీలర్లు ఎంచక్కా అమ్ముకుంటూ అవినీతిమయం చేస్తున్నారు.

అందులో వాటాగా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలకు కూడా ప్రతీ నెలా ఒక్కో డీలర్ నుంచి సొమ్ము అందుతోంది. ఇది ఒక పెద్ద కుంభకోణం గా ఉంది అని అంటున్నారు. పేదరికం నిర్మూలన పేరుతో మోడీ ప్రభుత్వం దేశంలో ఎనభై కోట్ల మందికి ఉచిత బియ్యం పధకం అందిస్తోంది.

ఏపీలో చూస్తే ప్రభుత్వాలు మారినా అవినీతి మాత్రం మారకపోగా తారస్థాయికి చేరుకుంటోంది. ఇక ఈ అవినీతి కధ ఎలా ఉంటుందంటే ఒక నియోజకవర్గంలో ఒక రేషన్ దుకాణంలో జరుగుతున్న అవినీతి వల్ల సదరు డీలర్ కి నెలకు యాభై వేల రూపాయలు వంతున సొమ్ము వస్తోంది.

ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉంటే రేషన్ గా వారికి బియ్యం 20 కిలోలు వస్తాయి. ఆ బియ్యం అయితే ఏ లబ్దిదారుడూ పుచ్చుకోవడం లేదు. దానిని వారే తిరిగి సదరు రేషన్ దుకాణం దారులకు ఇచ్చేస్తున్నారు. దానికి గానూ ఆ రేషన్ డీలర్ కిలోకి 9 రూపాయలు వంతున తిరిగి ఇస్తున్నాడు. అలా ఇరవై కిలోలకు 180 రూపాయలు లబ్దిదారులకు ఉచితంగా వస్తున్నట్లుగా లెక్క.

అలా సేకరించిన బియ్యాన్ని కిలో పదహారు రూపాయలు వంతెన హొటళ్లకు అమ్ముకుంటున్నారు రేషన్ డీలర్లు. అంతే కాదు రైస్ మిల్లర్లకు కూడా అమ్ముకుంటున్నారు. అలా వారు భారీగా సొమ్ముని సంపాదిస్తున్నారు. ఒక రేషన్ దుకాణంలో సగటున ఆరు వందల కార్డులు ఉంటాయి. ఆ కార్డుదారులందరిలో కనీసంగా నాలుగు వందల మంది అయినా ఉచిత బియ్యం తీసుకోవడం లేదు అని అంటున్నారు. మరి ఈ బియ్యం అంతా కూడా అక్రమంగా బయటకు తరలిపోతోంది.

అలా ఒక్కో రేషన్ డీలర్ కనీసంగా యాభై వేలకు తగ్గకుండా నెలకు ఈ ఉచిత బియ్యం ద్వారానే గడిస్తున్నారు అని అంటున్నారు. అయితే ఇందులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు స్థానిక ఎమ్మెల్యేకు ఇరవై నుంచి పాతిక వేలు ముట్ట చెబుతున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. అలా వైసీపీ ఎమ్మెల్యేల టైం లో నెలకు అన్ని డిపోల నుంచి వచ్చే సొమ్ము అక్షరాలా ఇరవై లక్షల రూపాయలుగా ఉంది.

అయితే ఇపుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. అయినా సరే ఈ దందా ఆగకపోగా రేట్లు పెంచి మరీ అవినీతిని చేసుకొమని అంటున్నారు అని ప్రచారం సాగుతోంది. బయట అన్ని ధరలూ పెరిగాయి కాబట్టి రేషన్ బియ్యం ధరలను కూడా బాగా పెంచేసి అమ్మండి, మాకు నెలకు ఒక్కో డీలర్ నలభై వేల రూపాయలు ఇవ్వండి అని టీడీపీ నేతల నుంచి ఒత్తిడి వస్తోంది అని అంటున్నారు.

హొటళ్లకు ఇవ్వకుండా రైస్ మిల్లులకు ఇవ్వండి దాని వల్ల మరింత ఎక్కువగా ధర వస్తుందని అలా తమకు కూడా వాటా పెంచమని కోరుతున్నారని తెలుస్తోంది. అంటే ఒక నియోజకవర్గంలో వంద డిపోలు ఉంటే కచ్చితంగా నలభై లక్షల దాకా ప్రతీ ఎమ్మెల్యేకు నెలకు ఇలా రేషన్ ద్వారానే సొమ్ము వచ్చేలా ఈ ఏర్పాటు ఉంది అని అంటున్నారు. అది కాస్తా ఏడాదికి కూడితే అయిదు కోట్లు. అయిదేళ్లకు కూడితే పాతిక కోట్లు. అంటే కేవలం రేషన్ ద్వారానే పాతిక కోట్లు ఒక్కో ఎమ్మెల్యేకు వచ్చే ఆదాయంగా ప్రచారంలో ఉన్న మాటగా ఉంది.

ఇలా ఉచిత బియ్యం పధకాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తూ అవినీతికి భారీగా తెర తీశారని ప్రజలు వాపోతున్నారు. మోడీ భాషలో చెప్పాలీ అంటే రేషన్ బియ్యం కాస్తా ఏటీఎం లా మారింది అని అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూంటే దానిని అరికట్టాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అని అంటున్నారు.

ప్రతీ రేషన్ డిపోల వద్ద వీడియో కెమెరాలను పెట్టి పంపిణీని మొత్తం రికార్డు చేయాలని అపుడే పారదర్శకంగా ఉంటుందని అంటున్నారు. అలాగే ఎప్పటికప్పుడు రైస్ మిల్స్ వద్ద దాడులు చేయలని సూచిస్తున్నారు. విచ్చలవిడిగా జరుగుతున్న ఈ అవినీతిని అరికట్టకపోతే మాత్రం ఉచిత బియ్యం తో ఏటీఎం మాదిరి అవినీతి సాగిపోతూనే ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News