వినేశ్ ఉడుం 'పట్టు'.. హరియాణలో బీజేపీకి ఊపిరాడనట్టు!

న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన పని లేదు.. జుట్టు పట్టుకుని ఈడ్చినా.. అణిగిమణిగి ఉండాల్సిన అగత్యం లేదు..

Update: 2024-09-25 17:30 GMT

మహిళలు రాజకీయాల్లోకి రావాలనుకుంటే రోడ్డెక్కాల్సిన అవసరం లేదు.. దుస్తులు చిరిగిపోయినా.. న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన పని లేదు.. జుట్టు పట్టుకుని ఈడ్చినా.. అణిగిమణిగి ఉండాల్సిన అగత్యం లేదు..

ఒకసారి మమ్మల్ని ముస్లింలన్నారు.. మరోసారి పాకిస్థాన్ మద్దతుదారులమని ఆరోపించారు.. ఇంకోసారి ఖలిస్థాన్‌ సానుభూతిపరులమని విమర్శించారు.. ఇన్నికోణాల్లో చెడు ముద్ర వేశారు.. బీజేపీ పెద్దలకు ఒక్కటే చెబుతున్నా.. ఇకపై ఇలాంటి రాజకీయాలు నడవవ్..

ఇవి ఏ సీనియర్ రాజకీయ నాయకుడో చేస్తున్న విమర్శలు కాదు.. తొలిసారి బరిలో దిగిన, నిన్నటివరకు అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఉన్న మహిళ వ్యాఖ్యలు.. కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఇటీవలి పారిస్ ఒలింపిక్స్ లో పతకం కోల్పోయిన రెజ్లర్ వినేశ్ ఫొగట్ చేస్తున్న పదునైన దాడి.. దీంతో హరియాణలో అధికార బీజేపీకి గుక్కతిప్పుకోలేని పరిస్థితి వస్తోంది. ఎన్నికల్లో ప్రత్యర్థిని ఇంతగా ‘పట్టు’ పట్టేస్తున్న రెజ్లర్ వినేశ్ దెబ్బకు బీజేపీ అబ్బా అంటోంది.

పొలిటికల్ ఎంట్రీలోనే హిట్

హరియాణా ఎన్నికల ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వినేశ్ ఫొగట్ జింద్ జిల్లాలోని జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తాను రాజకీయాలను అవకాశంగా తీసుకుని రాలేదని.. తన అవసరం ఉందనే వచ్చానని అంటున్నారు. తన పోరాటం కేవలం రెజ్లింగ్‌ కే పరిమితం కాకూడదని.. ప్రజల కోసం కూడా కొనసాగించాలని చాలామంది కోరారని చెబుతోంది. భవిష్యత్ తరాల కోసం తన శక్తిని అట్టిపెట్టినట్లు తెలిపింది.

బ్రిజ్ భూషణ్ కు మద్దతా?

భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా తాము పోరాడినప్పుడు చిన్నచూపు చూశారని.. అవమానించారని వినేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం తరపున ఎన్నో పతకాలు సాధించి, గుర్తింపు తెచ్చుకున్న తాను చాలా సులభంగా ఏదో ఒక పార్టీ తరపున రాజకీయాల్లోకి వచ్చేదాన్నని.. అయితే, బ్రిజ్ భూషణ్ సింగ్ వంటివారిపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తమపైనే అబద్ధాలు చెబుతున్నామంటూ నిందలు వేసిందని తప్పుబట్టారు. ఒలింపిక్స్‌ లోనూ తమకు న్యాయం జరగలేదని.. అందుకే రాజకీయాల్లోకి వచ్చానని, వ్యవస్థలను మార్చేందుకు వెసులుబాటు రాజకీయాల్లోనే ఉంటుందని వినేశ్ అంటున్నారు. బ్రిజ్ భూషణ్ పై తమ పోరాటాన్ని రాజకీయ ప్రేరేపితం అని విమర్శలు రాగా.. అసలు పోరాటానికి కారణమైంది ఇద్దరు బీజేపీ నాయకులని.. మరి కాంగ్రెస్ ను ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. జులానా నియోజకవర్గానికే పరిమితం కానని.. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటానని చెబుతున్నారు.

బీజేపీ తప్ప అన్ని పార్టీలు అండగా

బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా చేసిన ఆందోళనలో.. తాను, సహచర రెజ్లర్లందరూ పతకాలను గంగా నదిలో కలిపేస్తామని బెదిరిస్తే కాంగ్రెస్, మమతా బెనర్జీ మాత్రమే వద్దని వారించారని వినేశ్ తెలిపారు. తమ ధర్నా శిబిరానికి వచ్చి కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. రెజ్లర్ల నిరసన వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందనే బీజేపీ ఆరోపణలను వినేశ్ తప్పుబట్టారు. ఇలా ప్రచారంలో బీజేపీని వినేశ్ కడిగేస్తున్నారు. దీంతో ఆ పార్టీకి ఏం చెప్పాలో పాలుపోవడం లేదు.

Tags:    

Similar News